
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ను రీ లాంచ్ చేస్తూ నరేష్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నరేష్ ఇలా ముచ్చటించారు. ‘ఈ ఏడాదితో నటుడిగా యాభై ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 ఏళ్ళు. ఇవన్నీ కలసి వచ్చి మళ్ళీ కథానాయకుడిగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాన్ని గౌరవించేలా సినిమా ఉంటుంది. ‘డర్టీ హరి’ చూసినప్పుడే రాజు గారితో సినిమా చేయాలనుకున్నా. వేరే సబ్జెక్ట్ని చేయాలని అనుకున్నాం. అదే సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని ఆయన పరిశీలించారు. ఒక రోజు నా దగ్గరకి వచ్చి.. ‘నేను ఒక కథ చెబుతాను .. అది మీకు, మీ ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు.
అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు. చాలా రీసెర్చ్ చేశాం. నటుడిగా, నిర్మాతగా నాకిది పెద్ద ప్రయోగం. ఫ్యామిలీ ఆడియెన్స్కు ఎక్కువ రీచ్ అవుతుందనుకుంటే.. యూత్లో చాలా బజ్ వచ్చింది. డీసెంట్ ఓపెనింగ్స్తో విజయ్ కృష్ణ మూవీస్లో పెద్ద హిట్ కొడతామనే నమ్మకం వుంది. ప్రమోషన్స్ విషయంలో మేం ఎలాంటి గిమ్మిక్ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే మరోవైపు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశాయి. వాటికీ బ్లాస్ట్ ఇవ్వాలనుకుని, నేను, పవిత్ర కలిసి జీవిస్తున్నామని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాం. దానికోసం అప్పుడే లిప్ లాక్ వీడియోని షేర్ చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో ఇంకా చాలా షాకింగ్ కంటెంట్ ఉంది. ‘మళ్ళీ పెళ్లి’ ఎంటర్టైన్ చేస్తూనే.. ఆటమ్ బాంబ్లా పేలుతుంది. సొసైటీని కూడా ఫోకస్ చేసేలా ఉంటుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. ఎమోషనల్ కనెక్షన్ కూడా వుంది’.