నిధుల కోసం సీఎంని కలుస్తా : ఎమ్మెల్యే సునీతారెడ్డి

నిధుల కోసం సీఎంని కలుస్తా : ఎమ్మెల్యే సునీతారెడ్డి
  •     నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతారెడ్డి

శివ్వంపేట, వెలుగు :  తాను బీఆర్​ఎస్ ఎమ్మెల్యేను అయినా అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రిని  కలుస్తానని నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా  మంగళవారం మండలంలోని ఎదుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం గొప్ప విషయమని  సర్పంచ్ కీర్తనను అభినందించారు.

అనంతరం ఎంపీడీఓ ఆఫీస్​లో జరిగిన జనరల్​ బాడీ మీటింగ్​లో పాల్గొన్నఎమ్మెల్యే  గడచిన పదేళ్ల కాలంలో గ్రామాలలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మీటింగ్​లో సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో పనులు చేసినా బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్​ బిల్లులు ఇప్పించాలని కోరారు. సర్పంచుల పదవీ కాలం ముగియనున్న సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్​ ఎంపీపీ రమాకాంత్​రెడ్డి, జడ్పీ కో ఆప్షన్​ మెంబర్ మన్సూర్ అలీ  పాల్గొన్నారు.