వాషింగ్టన్:ఇండియా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మరికొద్ది రోజుల్లో చేపట్టబోతోంది. దానికి అయ్యే ఖర్చు ₹978 కోట్లు అని ఇస్రో ప్రకటించింది. మనం చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రకటించడం కన్నా ముందే అమెరికా నాసా మూన్ మిషన్ ‘ఆర్టిమిస్ (గ్రీసులో చంద్రదేవత పేరు)’ను ప్రకటించింది. 2024లో ప్రయోగాన్ని చేయడానికి సిద్ధమవుతోంది. మరి, ఆ ప్రయోగానికి అమెరికా పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? సుమారు ₹2.1 లక్షల కోట్లు. డాలర్లలో చెప్పాలంటే 3 వేల కోట్ల డాలర్లు. అవును, ఈ విషయాన్ని స్వయంగా నాసా చీఫ్ జిమ్ బ్రైడెన్స్టైన్ ప్రకటించారు. మూన్ మిషన్ చేపట్టాలంటే ఎంత లేదన్నా ₹1.39 లక్షల కోట్ల (2 వేల కోట్ల డాలర్లు) నుంచి ₹2.1 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆ ప్రయోగానికి అంత మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అంటే ఏటా సుమారు ₹27,952 కోట్ల (400 కోట్ల డాలర్లు) నుంచి సుమారు ₹41,928 కోట్లు (600 కోట్ల డాలర్లు) ఖర్చు అవుతుందని చెప్పారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్లు వెళ్లేలా చంద్రుడిపై అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ బతకడం, పనిచేసుకునేలా వసతులు కల్పించడం కోసం ఆర్టిమిస్ను చేపట్టినట్టు బ్రైడెన్స్టైన్ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే అంగారకుడిపైకీ చరిత్రలోనే తొలిసారిగా మనిషిని పంపే కార్యక్రమం చేపడతామన్నారు. నిజానికి చాలా మంది అంతకన్నా ఎక్కువే ఖర్చవుతుందంటూ చెప్పారని, తాము చెప్పింది దానికి తక్కువేనని అన్నారు. ఈ స్పేస్ఫ్లైట్ చాలా రిస్క్తో కూడుకున్నదని, ఏమవుతుందో ఊహించలేమని, అందుకే ఇప్పుడు చెప్పిన ఖర్చు కేవలం అంచనా మాత్రమేనని అన్నారు. అది పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చని వివరించారు. ఖర్చుపై ఫెడరల్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగంతో చర్చిస్తున్నామన్నారు. అంతేగాకుండా ఇటీవల కొత్తగా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ స్పేస్ కౌన్సిల్తోనూ చర్చిస్తున్నామన్నారు.
రాకెట్కే ₹83,800 కోట్లు
నాసా ఇప్పటికే కేవలం రాకెట్, స్పేస్క్రాఫ్ట్పైనే భారీగా ఖర్చు చేసింది. ప్రపంచంలోని ఏ రాకెట్ కూడా పనికిరాదన్నట్టుగా కొత్త రాకెట్ను తయారు చేసింది. అదే స్పేస్ లాంచ్ సిస్టం (ఎస్ఎల్ఎస్). ఆ రాకెట్తో చంద్రుడేంది.. అంగారకుడిపైకీ మనుషుల్ని తీసుకోవచ్చని చెప్పింది. ఆ ఒక్క భారీ రాకెట్ కోసం సుమారు ₹67,738 కోట్లు (970 కోట్ల డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. 2017లో ప్రారంభించిన రాకెట్ నిర్మాణానికి ఇప్పటికే ₹83,800 కోట్లు (1200 కోట్ల డాలర్లు) ధారపోశారు. వచ్చే ఏడాదికిగానీ ఆ రాకెట్ నిర్మాణం పూర్తి కాదని, అప్పటి వరకు దాని ఖర్చు మరింత పెరిగిపోతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. స్పేస్క్రాఫ్ట్ ఓరియన్పైనా డబ్బులు దండిగానే ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నారు. బ్రైడెన్స్టైన్ మాత్రం ఖర్చును వెనకేసుకొస్తున్నారు. 1960 తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రుడిపైకి మనిషిని పంపిస్తున్నామని, అయితే, అప్పటి ప్రయోగానికి, ఇప్పటి ప్రయోగానికి చాలా తేడాలున్నాయని ఆయన అన్నారు. కాబట్టి ఖర్చు ఎక్కువగానే ఉంటుందన్నారు. అందుకే ఆ ఖర్చును భరించేలా ప్రైవేట్ కంపెనీలకు ప్రయోగంలో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు.
వెళ్లే మహిళెవరు.. లిస్టులో సునీతా విలియమ్స్?
చంద్రుడిపై కాలుమోపిన తొలి వ్యక్తి ఎవరు.. అంటే ఠక్కున వచ్చే సమాధానం నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి, తొలి మహిళెవరు అంటే..? ‘ఆర్టిమిస్’లో మహిళను చంద్రుడిపై దింపుతామని నాసా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మహిళ ఎవరు అన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. అయితే, నాసాలో రోస్టర్ ప్రకారం ప్రస్తుతం 12 మంది మహిళా ఆస్ట్రోనాట్లున్నారు. వాళ్లలోనే ఎవరినో ఒకరిని పంపాలని నాసా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కూడా ఉండడం విశేషం. వాళ్లంతా కూడా 40 ఏళ్ల నుంచి 53 ఏళ్ల వయసు వారే. మాజీ మిలటరీ పైలట్లు, డాక్టర్లు, సైంటిస్టులున్నారు. ఇప్పటికే స్పేస్లో గడిపిన వారిని చంద్రుడిపైకి పంపితేనే బాగుంటుందని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఉన్న ఆనీ మెక్క్లెయిన్ బెస్ట్ చాయిస్ అని చెబుతున్నారు. ఐఎస్ఎస్లోనే ఉన్న క్రిస్టినా కోచ్ కూడా మంచి చాయిస్ అంటున్నారు. దాదాపు 11 నెలలు ఆమె స్పేస్లో ఉందన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆమె తర్వాత మెరీన్ బయాలజిస్ట్ జెస్సికా మైర్, నికోల్ మన్ పేర్లు వినిపిస్తున్నాయి. స్పేస్లో మంచి అనుభవమున్న సునీతా విలియమ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, 2024 నాటికి ఆమెకు 58 ఏళ్లు వస్తాయి. దీంతో ఆమె వయసును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో 77 ఏళ్ల జాన్ గ్లెన్ స్పేస్లోకి వెళ్లారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సునీతా విలియమ్స్.. చంద్రుడిపై అడుగు పెట్టే తొలి మహిళగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అన్ని పైసలిస్తరా?
ప్రయోగంపై డెమొక్రాట్లు ఇప్పటికే కొంత మూతిముడుపు ధోరణితో ఉన్నారు. వాళ్లను ఒప్పించి అంత బడ్జెట్ రాబట్టడమంటే బ్రైడెన్స్టైన్కు సవాల్తో కూడుకున్న పనేనని నిపుణులు అంటున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చందమామ ప్రయోగాన్ని చేసేయాలని తొందరపెడుతున్నారు. బడ్జెట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం అదనంగా సుమారు ₹11,173 కోట్లు (160 కోట్ల డాలర్లు) కావాలని, ఆమేరకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్కు నాసా రిక్వెస్ట్ కూడా పెట్టింది. అయితే, అది ఓ చిన్న డౌన్పేమెంట్ మాత్రమేనని బ్రైడెన్స్టైన్ చెబుతున్నారు. అయితే, విమర్శకులు మాత్రం మూన్ మిషన్పై పెదవి విరుస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల కోట్లను అనవసరంగా అంతరిక్షంలో కుమ్మరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 1972 అపోలో మిషన్ తర్వాత చంద్రుడిపైకి మనిషి పోయింది లేదు.. అక్కడ ప్రయోగాలు చేసింది లేదు గానీ.. వాటి పేరిట డబ్బులు మాత్రం ఉచితార్థంగా ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. అయితే, ఆర్టిమిస్ కోసం తామేం ‘మనుషుల్ని పీక్కు తినదలచుకోలేదు’ అని బ్రైడెన్స్టైన్ తేల్చి చెప్పారు.