- సంత్ సేవాలాల్ మహరాజ్ జ్ఞాపకార్థం నిర్మించాలి
ఖైరతాబాద్, వెలుగు : హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్తో సంత్ సేవాలాల్మహరాజ్కు ఎంతో అనుబంధం ఉందని మాజీ ఎంపీ, దక్షిణ భారత్, మహారాష్ట్ర, మధ్య భారత్ సేవాలాల్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రవీంద్రనాయక్ అన్నారు. ఆయన స్మారకార్థం పది ఎకరాలు భూమి కేటాయించి, మందిరం నిర్మించి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాలాల్ మహరాజ్ బంజారాహిల్స్, బంజారా దర్వాజా (గోల్కొండ )పరిసరాల్లో అనేక నెలల పాటు క్యాంపులు నిర్వహించారని గుర్తుచేశారు.
ఆయన జ్ఞాపకార్థం జాతీయ బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బంజారా సామాజికవర్గం రాజకీయంగా100 ఎంపీ, 400 ఎమ్మెల్యే సెగ్మెంట్లపై తమ ప్రభావం చూపగలదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్లు బంజారా తండా ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బంజారా భాష గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి భాషాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బంజారా నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంస్థ జాతీయ కన్వీనర్ జి. రవినాయక్, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.