ఒకప్పుడు అది రాళ్లు, చెత్తతో నిండిన ప్రదేశం. కానీ, ఇప్పుడు చిన్న అడవి. ఎనిమిదేళ్లలో మొత్తం మారిపోయింది. పనికిరాకుండా ఉన్న నేల ఇప్పుడు పచ్చగా పరుచుకున్న అడవికి చిరునామాగా మారింది. ఈ అడవి దానికది పెరిగింది కాదు. కొంతమంది నేచర్ లవర్స్ కలిసి 30 ఎకరాల్లో తీర్చిదిద్దిన అడవి.
దక్షిణ పూనేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎమ్) ఏరియాలో 33 ఎకరాల స్థలం ఖాళీగా ఉండేది. 2013లో ఈ ప్లేస్ అంతా రాళ్లు, చెత్తాచెదారం నిండిపోయి, పిచ్చి మొక్కలతో ఉండేది. కొంతమంది ఇక్కడ తాగేవాళ్లు. ఇలాంటి ప్లేస్ను పనికొచ్చేలా వాడుకోవాలనుకుంది ‘ఆనంద్ వన మిత్ర మండలి (ఏవీఎమ్ఎమ్)’ అనే సంస్థ. ఈ ట్రస్టుకు చెందిన సభ్యులు ఈ ప్లేస్ను చిన్నఅడవిగా మార్చాలనుకున్నారు.
అందరినీ ఒప్పించి
ఈ ప్లేస్ను మార్చాలంటే తప్పకుండా స్థానికుల సహకారం అవసరం. అందుకే ఏవీఎమ్ఎమ్ సభ్యులు చాలా కష్టపడి, చుట్టుపక్కల ఉండేవాళ్లని ఈ విషయంలో సహకారం అందించమని కోరారు. ఇక్కడ చెత్త వేయకుండా, ఇతర పనులకు వాడకుండా ఉండాలని సూచించారు. ఈ ప్లేస్ పచ్చగా మారితే ఎంత ఉపయోగంగా ఉంటుందో వివరించారు. మొదట్లో ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, మెల్లిమెల్లిగా అందరూ సహకరించారు. దీంతో ఏవీఎమ్ఎమ్కు చెందిన సభ్యులు అంతా కలిసి ప్రతి వీకెండ్లో ఈ ప్లేస్ను శుభ్రం చేయడం, మట్టి తవ్వడం, మొక్కలు నాటడం వంటి పనులన్నీ చేసేవాళ్లు.
అటవీ శాఖ కూడా...
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లను కలిసి తమకు హెల్ప్ చేయమని అడిగారు. వాళ్లు ఈ ప్లేస్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బయటివాళ్లెవరూ లోపలికి రాకుండా, మొక్కలు పాడుచేయకుండా ఉండేందుకు ఇది హెల్ప్ అయింది. మొక్కలకు నీళ్లు పోయడం మరో సవాలు. చిన్న చిన్న క్యాన్లలో నీళ్లు తెచ్చి పోసేవాళ్లు. కొందరు అప్పుడప్పుడు వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తెచ్చేందుకు హెల్ప్ చేసేవాళ్లు. అందరి సహకారంతో మొక్కలు నాటడం, వాటిని జాగ్రత్తగా పెంచడం చేశారు.
పదివేల మొక్కలు
- ఏవీఎమ్ఎమ్ గ్రూప్లో చిన్న పిల్లలు, యువత, అరవై ఏళ్లు పైబడ్డ ముసలివాళ్లు కూడా ఉన్నారు. ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఈ పనిలో సాయపడ్డారు. అందరూ కలిసి దాదాపు పదివేలకు పైగా మొక్కలు నాటారు. కేవలం చెట్లు పెరిగితే చాలదు. పక్షులు కూడా ఉండాలి.
- అందుకే పక్షులను ఆకర్షించేందుకు, అవి గూళ్లు కట్టుకునేందుకు ప్రత్యేకంగా కొన్ని మొక్కలు పెంచారు.
- దాదాపు 90 రకాల చెట్లు పెంచారు. మొత్తం 30 ఎకరాల్లో ఈ ప్లేస్ను అడవిగా మార్చి ‘ఆనందవన్’ అని పేరు పెట్టారు. దీనికి ఎంట్రన్స్ గేట్, గోడ ఏర్పాటు చేశారు. సిటీ మధ్యలో ఇప్పుడు ఈ అడవి అందరినీ ఆకర్షిస్తోంది.