
- నవాపేటలో పార్ట్ బీ లో 1,500 ఎకరాలు
మెదక్/శివ్వంపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సాగులో ఉన్న భూమిపై ఎలాంటి హక్కులు లేక నష్టపోతున్న వందలాది మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టం అమలులో భాగంగా భూముల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండడంతో తమ సమస్య పరిష్కారమై న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2017లో చేపట్టిన భూ ప్రక్షాళన సందర్భంగా రెవెన్యూ,- ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య వివాదం ఉందని చెప్పి శివ్వంపేట మండలం నవాపేటలో సర్వే నంబర్ 216, 236, 262, 309, 417 లో సుమారు 1,500 ఎకరాలను రెవెన్యూ అధికారులు పార్ట్ -బీలో పెట్టారు.
దీంతో ఆ భూములను సాగు చేసుకుంటున్న సుమారు 600 మంది రైతులకు కొత్త పాస్ బుక్ లు రాలేదు. ఫలితంగా ఆ రైతులకు క్రాప్ లోన్లు రావడం లేదు. రైతుబంధు అందడం లేదు. రైతు బీమా వర్తించడం లేదు. పాస్ బుక్ లు లేకపోవడంతో పండించిన ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతులు ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్ మొదలుకుని కలెక్టర్వరకు ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఆఫీస్ల ముందు ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేకు, మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు జాయింట్ సర్వే చేసి సమస్య పరిష్కరించాల్సి ఉండగా ఏళ్ల తరబడిగా కాలాయాపన జరుగుతోంది. దీంతో రైతులకు పట్టా పాస్బుక్లు రాక ప్రభుత్వ పరంగా లభించే ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్స్థానంలో కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం అమలులో భాగంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యలపై బాధిత రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. భూభారతి చట్టం ద్వారా భూమి సమస్యలన్నీ పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి చెబుతుండడంతో నవాపేట రైతులు తమ సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు. గురువారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పార్ట్ బీ సమస్య పరిష్కరించి తమకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వాలని సంబంధిత రైతులు అడిషనల్ కలెక్టర్ నగేశ్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
అర్హులైన ప్రతీ రైతుకు పాస్బుక్
భూభారతి చట్టం అమలులో భాగంగా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కలిసి త్వరలో జాయింట్సర్వే నిర్వహించి పార్ట్ బీ- భూమి సమస్య పరిష్కరిస్తాం. అర్హులైన ప్రతీ రైతుకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం. నవాపేట రైతుల సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరిస్తాం.
కమలాద్రి, శివ్వంపేట, తహసీల్దార్
ధరణితో అన్యాయం
గత ప్రభుత్వంలో ధరణి వచ్చాక మా గ్రామంలో 1,500 ఎకరాలు పార్ట్ -బీ లో పెట్టారు. మా తాత తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూమి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య వివాదం ఉందని కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. అప్పటి కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం కానీ మా సమస్యను పరిష్కరించలేదు.
మోహన్ రెడ్డి, రైతు, నవాపేట
అన్ని విధాలుగా నష్టపోతున్నాం
మా భూములు పార్టు బీలో పెట్టడంతో రైతుబంధు, రైతు బీమా రావడం లేదు. రుణమాఫీ కాలేదు. బ్యాంకులో క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. వడ్లు అమ్ముకుందామంటే కొత్త పాస్ పుస్తకాలు లేక కాంటా పెట్టకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నాం. అన్ని విధాలుగా నష్టపోతున్నాం. సమస్యను పరిష్కరించమని ఆఫీసర్ల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. భూభారతితోనైనా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.
జంగారెడ్డి , రైతు, నవాపేట