పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్న పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సిద్ధూ ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్ధూ వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈరోజు మధ్యాహ్నం, సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్లో తరలించారు.
కాగా 1988లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం సిద్ధూను వైద్య పరీక్షల నిమిత్తం పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిద్ధూ ఎంబోలిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి కాలేయ వ్యాధి కూడా ఉందని సమాచారం.