
- రూ.45 లక్షలతో రిపేర్లు, సౌకర్యాలు
- పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణానికి కలిగోట్లో 30 ఎకరాల ల్యాండ్ అలాట్
- కేంద్రం ఫండ్స్ ఇవ్వగానే పనులు షురూ
- ఈ నెల 14 నుంచి నవోదయ ప్రారంభం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది నుంచి జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 6వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తున్నారు. ఒక్కో క్లాస్ పెంచుతూ ఇంటర్ వరకు కొనసాగిస్తారు. స్కూల్ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి మండలం కలిగోట్ విలేజ్లో 30 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యాక నిర్మాణ పనులు షురూ కానున్నాయి.
అప్పటివరకు నిజామాబాద్ డైట్ కాలేజీ బిల్డింగ్ను వినియోగించనున్నారు. ఈ నెల 14న స్కూల్ ప్రారంభం కానుండగా, ఎంపీ అర్వింద్ ఇచ్చిన రూ.20 లక్షలతోపాటు కలెక్టర్ ఫండ్ రూ.25 లక్షలతో రిపేర్లు, వాటర్ప్లాంట్, కరెంట్ ఫెసిలిటీ, కలర్స్ వేసి సిద్ధం చేశారు. ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలనే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో 1986లో స్కూల్ను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
2016 అక్టోబర్లో జిల్లాల విభజన జరిగాక నిజాంసాగర్ మండలం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లింది. నిజామాబాద్కు 2025లో కేంద్రం నవోదయ స్కూల్ను మంజూరు చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను
ఎంపిక చేయనుండగా, ఆరో క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ విద్య అందించడంతోపాటు వసతి, భోజనం, క్రీడలు, దేశభక్తి, ఎన్సీసీ, చిత్రలేఖనం, సాంస్కృతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏటా నవోదయ ప్రవేశాలకు క్రేజ్ పెరుగుతోంది.
జిల్లాకు జవహర్ నవోదయ మంజూరయ్యాక ఎక్కడ ప్రారంభించాలనే అంశంపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడ్డారు. మూడు భవనాలు పరిశీలించి చివరకు డైట్ కాలేజీ బిల్డింగ్ ఎంపిక చేశారు. దీనిని ఏడాది క్రితం వరకు కేంద్రీయ పాఠశాల కోసం వినియోగించారు. కేంద్రీయ స్కూల్ కొత్త బిల్డింగ్లోకి షిష్ట్ కావడంతో నవోదయకు వాడనున్నారు. మొదటి ఏడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పూర్తి చేసి గర్ల్స్, బాయ్స్కు వేరువేరు హాస్టల్స్, టాయిలెట్స్, టీచర్స్ అకామిడేషన్ పనులు కంప్లీట్ చేశారు. నిజాంసాగర్ నవోదయ ప్రిన్సిపాల్కు నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు.
14 నుంచి స్కూల్ ప్రారంభం..
ఈ నెల 14 నుంచి స్కూల్ ప్రారంభమవుతోంది. ఆరో తరగతిలో 40 మందికి అడ్మిషన్లు ఇవ్వనున్నాం. కేంద్రం నుంచి రూ.వంద కోట్లు రాగానే కలిగోట్ లో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అప్పటిదాకా డైట్ కాలేజీలోనే నవోదయ కొనసాగుతుంది.
మను యోహనన్, ఇన్చార్జి ప్రిన్సిపాల్