- పరారీలో ప్రైవేట్ డిటెక్టివ్ గోసావి
ముంబై: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ను తప్పించే ప్రయత్నం జరిగిందని ప్రధాన సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ఇందుకోసం ఆర్యన్ తండ్రి షారుఖ్ ఖాన్ను రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించాడు. క్రూయిజ్ షిప్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు దాడి చేసినపుడు ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి, ఆయన బాడీగార్డు ప్రభాకర్ సెయిల్ అక్కడే ఉన్నారు. ఈ కేసులో ఆయనను ప్రధాన సాక్షిగా అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో ఆర్యన్ను తప్పించే ప్రయత్నం జరిగిందని ఆదివారం సెయిల్ మీడియాతో చెప్పాడు. ఆర్యన్ తండ్రి షారుఖ్తో డీల్ కుదుర్చుకునేందుకు గోసావి, ఎన్సీబీ అధికారి ఒకరు ప్రయత్నించారని చెప్పారు. రూ.25 కోట్లు డిమాండ్ చేసి, రూ.18 కోట్లకు డీల్ కుదిరేలా చూస్తానని సదరు అధికారితో గోసావి ఫోన్లో చెప్పారన్నాడు. అందులో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు అందజేస్తానని గోసావి వివరించాడని సెయిల్ తెలిపాడు. ఇదంతా తన కళ్ల ముందే జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న తనతో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని ఎన్సీబీ అధికారులపై ఆరోపణలు గుప్పించాడు. కాగా, ప్రైవేట్ డిటెక్టివ్గా చెప్పుకుంటున్న గోసావి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయనపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఎన్సీబీ ఆఫీసులో ఆర్యన్ ఖాన్తో గోసావి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఎన్సీబీ ఆఫీసులో ఉన్న ఆర్యన్తో గోసావి ఫోన్ మాట్లాడిస్తున్న వీడియోను సెయిల్ మీడియాకు అందజేశాడు.
తప్పుడు ఆరోపణలు: ఎన్సీబీ
లంచం ఆరోపణలను ఎన్సీబీ కొట్టిపారేసింది. సెయిల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, సంస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అధికారులు చెప్పారు. మరోవైపు, క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసే ఫాల్స్ కేసని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సెయిల్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సిట్తో విచారణ జరిపించాలని మంత్రి డిమాండ్ చేశారు.