
పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై 40శాతం సుంకాన్ని విధించాలని కేంద్రప్రభుత్వం శనివారం రోజు (ఆగస్టు 19న) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వాసులకు 25 రూపాయలకు కిలో లెక్కన ఉల్లిపాయలను సరఫరా చేయాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) నిర్ణయించింది.
సోమవారం (ఆగస్టు 21వ తేదీ) నుంచి రాయితీపై కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని ఎన్సీసీఎఫ్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే టమాటాలను విక్రయిస్తోన్న ఎన్సీసీఎఫ్.. బఫర్ నిల్వల నుంచి ఉల్లిని కూడా రాయితీపై ప్రజలకు విక్రయించనుంది.
బఫర్లో ఉంచిన ఉల్లిని ఢిల్లీలో సబ్సిడీపై సోమవారం నుంచే విక్రయాలు మొదలుపెడతామని ఎన్సీసీఎఫ్ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. మొబైల్ వ్యాన్లు, రెండు రిటైల్ దుకాణాల ద్వారా కిలో ఉల్లిని రూ.25ల చొప్పున అందిస్తామన్నారు. ఇప్పటికే 10 వ్యాన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉల్లిని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ ఉల్లిని అందించడం ద్వారా ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో లభ్యత మెరుగుపడుతుందన్నారు.