న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ 2023 ఆర్థిక సంవత్సరంలో 180 రిజల్యూషన్ ప్లాన్లను ఆమోదించింది. ఇప్పటి వరకు ఇన్ని ప్లాన్లను ఆమోదించడం ఇదే మొదటిసారి. దీంతో రూ. 51,424 కోట్ల విలువైన మొండిబాకీల కేసులు పరిష్కారమయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. ఎస్సార్ స్టీల్, మొన్నెట్ ఇస్పాత్ వంటి కొన్ని పెద్ద- కంపెనీలవి సహా 77 సంస్థల దివాలా ప్రక్రియలను పూర్తి చేసింది. మొత్తం రియలైజేషన్ (ఆస్తుల అమ్మకంతో వసూలైనది) విలువ రూ. 1.11 లక్షల కోట్ల వరకు ఉంది.
2023 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి 1,42,543 కోట్ల రూపాయల మొత్తం క్లెయిమ్లలో 36 శాతం క్లెయిమ్లను పరిష్కరించింది. దీంతో సంబంధిత బ్యాంకులకు ఎంతో మేలు జరిగింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం, 180 కార్పొరేట్ బ్యారోవర్ల (సీడీ) ఆస్తుల మొత్తం లిక్విడేషన్ విలువ రూ. 39,110.10 కోట్లు కాగా, బ్యాంకులు దాని కంటే 131 శాతం అధికంగా పొందాయి. అంతేకాకుండా 2023 ఆర్థిక సంవత్సరంలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్పీ) ప్రారంభించడానికి బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి 1,255 దరఖాస్తులను అంగీకరించింది.
2019 తరువాత ఇన్ని కేసులను తీసుకోవడం ఇదే మొదటిసారి. ఎన్సీఎల్టీ 2022 ఆర్థిక సంవత్సరంలో 147 రిజల్యూషన్ ప్లాన్లను ఆమోదించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 121 ప్లాన్లను, 2020 ఆర్థిక సంవత్సరంలో 134 ప్లాన్లను ఆమోదించింది. వీటి నుంచి బ్యాంకులు వరుసగా 23 శాతం, 17 శాతం, 26 శాతం డబ్బును వాపసు పొందాయి. ఎన్సీఎల్టీ 2033 ఆర్థిక సంవత్సరం చివరి వరకు మొత్తం 678 రిజల్యూషన్ ప్లాన్లను క్లియర్ చేసింది. క్రెడిటార్లు రూ. 2.86 లక్షల కోట్లను పొందారు. ఎన్సీఎల్టీకి భారతదేశం అంతటా 31 బెంచ్లు ఉండగా, వీటిలో 28 పని చేస్తున్నాయి.