వైజాగ్: పలు కేసుల దర్యాప్తులో ఆలస్యంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సైబర్ క్రైమ్ సీఐ, ఎస్ ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం వైజాగ్ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ పోలీస్ కమిషనర్ ను నేరుగా సంప్రదించి తన గోడును వినిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక సైబర్ నేరాలు విశాఖలోని నమోదవుతున్న క్రమంలో కేసుల దర్యాప్తులో నైపుణ్యం కోసం ఇక్కడ పోలీసులకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఢిల్లీలో నిపుణులైన పోలీస్ ఉన్నతాధికారులు సైబర్ నేరాల మిస్టరీ లను చేదించడంలో మెలకువలను నేర్పించి, విశాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించారు. ఓవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా.. యావత్ పోలీసు శాఖ అహోరాత్రులు రోడ్లపై విధులు నిర్వర్తిస్తూ ఉంటే, మరోవైపు సైబర్ పోలీసులు ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సీఐ గోపీనాథ్, ఎస్ ఐ రవికుమార్ లను విధుల నుంచి తప్పించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ కి గురయ్యారు.