
ఖట్మండ్: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 128కి చేరింది. శుక్రవారం ( నవంబర్4) అర్థరాత్రి భూకంపం సంభవించడంతో జాజర్ కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
నేపాల్ లో అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4 గా నమోదు అయింది. దాదాపు 20 సెకనులపాటు భూమి సంభవించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, బీహార్ లలో శుక్రవారం (అక్టోబర్ 4) అర్థరాత్రి భూమి కంపించింది. జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 11.32 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం కారణంగానే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్విట్టర్లో వెల్లడించింది.
మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడు భద్రతా ఏజెన్సీల ద్వారా సహాయ చర్యలు చేపట్టినట్టు నేపాల్ ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపారు. భూకంప ప్రాంతాల్లో పర్యటించేందుకు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సందర్శించారు. దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలో కూడా భూకంప ప్రభావం చూపింది. ప్రాణనష్టం , ఆస్తి నష్టం జరిగినట్లు నేపాల్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని చికిత్స కోసం జాజర్ కోట్ ఆస్పత్రికి తరలించారు.
2015 తర్వాత నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం ఇది.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 12వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10లక్షల ఇండ్లు నేలమట్టమయ్యాయి.
నేపాల్ ప్రజలకు ప్రధాని మోదీ సంఘీభావం
నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధానిమోదీ తీవ్రవిచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. సాధ్యమై నంత వరకు సాయం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.