ఇక నుంచి రాయల్ ఎన్‌‌ఫీల్డ్ నుంచి 3 నెలలకో కొత్త బైక్..

ఇక నుంచి రాయల్ ఎన్‌‌ఫీల్డ్ నుంచి 3 నెలలకో కొత్త బైక్..

న్యూఢిల్లీ: వచ్చే ఏడేళ్లలో  కనీసం 28 కొత్త బైక్‌‌లను లాంచ్ చేయాలనే ప్లాన్‌‌లో ఉన్నామని మోటార్‌‌‌‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌‌ఫీల్డ్ తెలిపింది. ప్రతి మూడు నెలలకు ఒక బైక్‌‌ను తెస్తామని చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో తన పొజిషన్‌‌ను మరింత పెంచుకోనున్నామని రాయల్ ఎన్‌‌ఫీల్డ్ సీఈవో వినోద్ కే దాసరి  చెప్పారు. వచ్చే 6–12 నెలల్లో థాయ్‌‌ల్యాండ్‌‌లో ఒక అసెంబుల్ యూనిట్‌‌ను పెడతామని కూడా తెలిపారు. ఆ తర్వాత బ్రెజిల్‌‌లో అసెంబుల్ యూనిట్ వస్తుందన్నారు. ప్రతి క్వార్టర్‌‌‌‌లో ఒక కొత్త మోడల్‌‌ లాంచ్ చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లకు తమ వద్ద ప్రొడక్ట్ ప్లాన్ ఉందన్నారు. ఈ మోడల్స్ అన్ని కూడా మిడ్ సెగ్మెంట్ 250సీసీ నుంచి 750సీసీ మధ్యలోనే ఉండనున్నాయని అన్నారు. ఇదే తమ ఫోకస్ ఏరియా అని చెప్పారు. అయితే ఈ కొత్త ప్రొడక్ట్‌‌ల కోసం ఎంత మొత్తంలో ఇన్వెస్ట్‌‌మెంట్లు పెడుతున్నారో మాత్రం దాసరి వెల్లడించలేదు. కంపెనీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వేల కోట్లలో ఉంటాయని అంచనాలున్నాయి. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్లను కొత్త ప్రొడక్ట్‌‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటల్ సొల్యుషన్స్ వంటి కొత్త టెక్నాలజీస్‌‌పై ఉంటాయని తెలుస్తోంది.

వచ్చే రెండు లేదా మూడేళ్లకు సరిపడ ప్రొడక్షన్ కెపాసిటీ తమ వద్ద ఉందని దాసరి అన్నారు. తమ ఇన్వెస్ట్‌‌మెంట్లు ఎక్కువగా కొత్త ప్రొడక్ట్‌‌ల డెవలప్‌‌మెంట్, టెక్నాలజీ, గ్లోబల్ విస్తరణపై ఉండనున్నాయని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌‌లో గ్రోత్ అంచనాలపై మాట్లాడిన దాసరి, ఈ ఏడాది నెలవారీ బేసిస్‌‌లో తమ గ్రోత్‌‌ను లెక్క కడతామని చెప్పారు. కరోనా కారణంతో ఎలాంటి కార్యకలాపాలు లేక ఐదు నెలలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం బుకింగ్స్ కరోనా ముందటి స్థాయిల కంటే మెరుగ్గా ఉన్నాయని దాసరి చెప్పారు. గత అక్టోబర్‌‌‌‌తో పోలిస్తే ఈ అక్టోబర్ అమ్మకాలు బాగున్నాయన్నారు.