
- గబ్బిలాల నుంచి కూడా.. వాటి జీన్స్తో పోల్చి చూసిన సైంటిస్టులు
- వుహాన్, హువాంగాంగ్ సిటీలకు రాకపోకలు బంద్
- రైళ్లు, బస్సులు, విమానాలు స్టాప్
- సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, ఎగ్జిబిషన్ సెంటర్లు మూత
- గ్లోవ్స్, మాస్కులకు భారీగా పెరిగిన డిమాండ్
- 10 వేలకు పైనే కేసులంటున్న నిపుణులు
- గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదన్న డబ్ల్యూహెచ్వో
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పాముల నుంచి పాకిందట. అది కూడా ఆ వైరస్కు మూలమైన చైనా సిటీ వుహాన్ నుంచే మనుషుల్లోకి వచ్చిందట. చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సెంటర్ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ‘‘వుహాన్లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్ పాకింది’’ అని యూనివర్సిటీ రీసెర్చర్ వీ జి చెప్పారు. కొత్త కరోనా వైరస్ జీన్స్ను పాత కరోనావైరస్ జీన్స్తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్ జీన్స్ కాంబినేషన్తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మనుషులకు సోకడానికి ముందు పాముల్లోనే ఎక్కువగా ఆ వైరస్ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ‘‘అన్ని ఫలితాలను పరిశీలించాక పాముల వల్లే ఈ కొత్త కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నాం’’ అని తమ రిపోర్టులో సైంటిస్టులు పేర్కొన్నారు. బీజింగ్లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన స్టడీలోనూ ఈ విషయమే వెల్లడైంది. కొత్త కరోనా వైరస్కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు. నిపుణులు మాత్రం వుహాన్ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు.
10 వేలకుపైనే కేసులు
జపాన్, తైవాన్, అమెరికా, హాంకాంగ్, బ్రిటన్, ఆస్ట్రేలియాకు పాకిన కొత్త వైరస్, ఇప్పుడు మెక్సికో, కొలంబియాలకూ పాకింది. అక్కడ ఒక్కో వ్యక్తికి ఆ వైరస్ సోకినట్టు గుర్తించారు. ఇక, వైరస్ వల్ల ఇప్పటికే 17 మంది చనిపోయారు. 571 మంది దాకా దాని బారిన పడ్డారు. అయితే, వైద్యాధికారులు మాత్రం కేసులు పది వేలకు పైనే ఉంటాయని భావిస్తున్నారు. అంతేగాకుండా హెచ్ఐవీ లాగానే ఈ కొత్త కరోనా వైరస్కూ తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాదు
వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలన్న అధికారుల వాదనను డబ్ల్యూహెచ్వో కొట్టి పారేసింది. ‘‘ఇప్పటికిప్పుడు దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించలేం. దానిపై మరింత సమాచారం కావాలి. దీనిపై ఎమర్జెన్సీ కమిటీ మరోసారి సమావేశమై డిసైడ్ చేస్తే బాగుంటుంది’’ అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియెసస్ అన్నారు. చైనా తీసుకుంటున్న చర్యలతో వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుతుందన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా గట్టి చర్యలే తీసుకుంటోందన్నారు. ఇక, వుహాన్ నుంచి వచ్చిన ప్రజల కోసం స్పెషల్గా క్వారెంటైన్ జోన్లను ఏర్పాటు చేసింది.
వైరస్కు వ్యాక్సిన్!
కరోనా వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికా సైంటిస్టులు. బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చర్లు వ్యాక్సిన్పై రీసెర్చ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని, మరో ఆరేళ్లయినా పడుతుందని ట్రాపికల్ మెడిసిన్ విభాగం డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ చెప్పారు. కరోనావైరస్ సోకిన 2000వ సంవత్సరం నుంచే వ్యాక్సిన్పై పరిశోధనలు మొదలయ్యాయని, వైరస్ తీవ్రత తగ్గగానే ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త రకం వైరస్ పుట్టుకురావడంతో రీసెర్చ్ చేస్తున్నారని వివరించారు.
వుహాన్లో సర్వం బంద్
వైరస్కు మూలకారణమైన వుహాన్ సిటీకి రాకపోకలను చైనా బంద్పెట్టింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. రైళ్లు, బస్సులనూ ఆపేసింది. దీంతో చివరి ఫ్లైట్, చివరి ట్రైన్ను అందుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అన్నీ మూత పడ్డాక రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. ఇటు 70 లక్షల మంది దాకా ఉండే హువాంగాంగ్ సిటీకీ రాకపోకలను చైనా ప్రభుత్వం బంద్ చేసింది. ఆయా సిటీల నుంచి వైరస్లు వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అంతేగాకుండా కేఫెలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్ సెంటర్లు, షాపింగ్ మాళ్లన్నింటినీ మూసేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఏడుపు తప్ప ఇంకేం లేదని అక్కడి జనాలు వాపోతున్నారు. వైరస్ నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హువాంగాంగ్కు అతి దగ్గరలోనే ఉండే ఈజౌ సిటీలోనూ రైళ్లను ఆపేశారు. వైరస్ నేపథ్యంలో చైనాలో సర్జికల్ మాస్కులు, గ్లోవ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో కొన్ని చోట్ల వ్యాపారులు రేట్లు భారీగా పెంచేసి అమ్ముతున్నారు. రేట్లు పెంచితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.