న్యూఢిల్లీ: కరోనాకు ప్రస్తుతమున్న వ్యాక్సిన్ల కన్నా బాగా పని చేసే సరికొత్త వ్యాక్సిన్ను డెవలప్ చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు (ఐఐఎస్సీ) ప్రయోగాలు చేస్తోంది. మన దేశ పరిస్థితులకు అనువుగా ఉండేలా మరింత శక్తివంతమైన, సమర్థవంతమైన, అనుకూలమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. కరోనా వైరస్పై పోరాడే ప్రొటీన్ను గుర్తించామని, దీని ద్వారా శక్తివంతమైన యాంటీబాడీలను అత్యధికంగా అభివృద్ధి చేయొచ్చని ఐఐఎస్సీ మాలిక్యులార్ బయాలజీ సైంటిస్టులు చెప్పారు. ఎలుకలపై చేసిన ట్రయల్స్లో మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. ఇటీవల కోలుకున్న కరోనా పేషెంట్లలో ఉన్న యాంటీబాడీలతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయన్నారు. ‘కొత్త రకం వైరస్లు పెరిగితే వాటిని ఎదుర్కునే క్రమంలో యాంటీబాడీలు తగ్గుతాయి. అయితే కొత్త వ్యాక్సిన్ ద్వారా ప్రస్తుతమున్న వ్యాక్సిన్ల కన్నా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ప్రమాదం ఉండదు’ అని సైంటిస్టులు చెప్పారు.
ఐఐఎస్సీ నుంచి పవర్ఫుల్ వ్యాక్సిన్
ప్రస్తుతమున్న లైసెన్డ్స్ వ్యాక్సిన్లతో పోలిస్తే తాము తయారు చేసే వ్యాక్సిన్ వేరని సైంటిస్టులు చెప్పారు. తమ వ్యాక్సిన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అని.. వైరస్ స్పైక్ ప్రోటీన్తో టీకాను డెవలప్ చేస్తున్నామని వివరించారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో డెవలప్ చేశాక చిన్న జంతువులపై విష ప్రభావం, సేఫ్టీ విషయంలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తర్వాత మనుషులపై వేర్వేరు దశల్లో క్లినికల్ ట్రయల్స్ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి సంవత్సర కాలం పడుతుందని వివరించారు. ఈ వ్యాక్సిన్ను భద్రపరిచేందుకు రూమ్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేస్తే సరిపోతుందని అన్నారు.