
- జిల్లా కలెక్టర్ అధ్యక్షతనడిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ
- అన్ని గురుకులాలు,అంగన్వాడీలు, స్కూళ్లకు సరఫరా
- హాస్టల్స్, మధ్యాహ్న భోజనానికి మినహాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో గుడ్ల సరఫరా, సేకరణకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 28 పేజీల ఉత్తర్వుల కాపీలో టెండర్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం జత చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ (డీపీసీ) ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, మరో 14 మంది అన్ని గురుకులాల కో ఆర్డినేటర్లు, అంగన్ వాడీ అధికారులు, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ అధికారులు మెంబర్లుగా ఉంటారు.
ఈ గైడ్ లైన్స్ లో మధ్యాహ్న భోజనం స్కీమ్ కు మినహాయింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్లు టెండర్లు పిలిచి.. వచ్చే నెల ఒకటో తేదీ వరకు మొత్తం పక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఒక్కో గుడ్డు కచ్చితంగా 45 నుంచి 52 గ్రాముల బరువు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ప్రతి ఏటా అంగన్ వాడీలు, అన్ని గురుకులాలకు 80 కోట్ల గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.