WAC 2025: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్.. ఇండియా ఆశలు సజీవంగా ఉంచిన సచిన్ యాదవ్

WAC 2025: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్.. ఇండియా ఆశలు సజీవంగా ఉంచిన సచిన్ యాదవ్

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో ఇండియా అథ్లెట్ నీరజ్ చోప్రాకు నిరాశే మిగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి వైదొలిగాడు. తన మొదటి ఐదు ప్రయత్నాల్లో విఫలం కావడంతో మెన్స్ జావెలిన్ ఫైనల్ నుండి దురదృష్టవశాత్తు నిష్క్రమించాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ ఫైనల్‌ను నీరజ్ 8వ స్థానంతో ముగించాడు. నీరజ్ చోప్రా నిష్క్రమించిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ ఇండియా ఆశలను సజీవంగా ఉంచాడు. 85.96 త్రోను విసిరి నాలుగో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు నిలిపాడు. 

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన కిరీటాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. 27 ఏళ్ల ఈ ఈ టాప్ ఇండియన్ అథ్లెట్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అయితే టోక్యోలో అతను విఫలమయ్యాడు. ఫైనల్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోయాడు. నీరజ్ అత్యధిక స్కోరు రెండవ రౌండ్‌లో 84.03 మీటర్లతో నమోదైంది. ఆ తర్వాత నీరజ్ తన శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా తన చివరి త్రోలో నీరజ్ సరిగ్గా ల్యాండ్ కాకపోవడంతో తదుపరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయాడు.    

నీరజ్ నిరాశపరిచినప్పటికీ మరో భారత జావెలిన్‌ స్టార్ సచిన్ యాదవ్ ఇండియా ఆశలు మోస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ యాదవ్ తన మొదటి ప్రయత్నంలోనే 86.27 స్కోరు సాధించాడు. రేసులో రెండవ స్థానంలో నిలిచినా చివరికి నాలుగో స్థానంలో నిలిచాడు. సచిన్ 2024లో బెంగళూరులో జరిగిన 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా వార్తల్లో నిలిచాడు. అప్పటి నుండి చాలా నిలకడగా రాణిస్తున్నాడు. 83.67 త్రోతో సచిన్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సమ్మిట్ క్లాష్‌లో 85 మీటర్ల త్రోలని విసిరి అందరినీ ఆకట్టుకున్నాడు.  కానీ టోర్నమెంట్‌లో మూడవ స్థానంలో నిలిచిన కర్టిస్ థాంప్సన్‌ను పడగొట్టలేకపోయాడు.