నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతా సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లెమెంట్ను ప్రారంభిస్తారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే..
- నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకే మొదలవుతుంది. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర హవన్, పూజతో ప్రారంభమవుతుంది. ఈ పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. 8.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయి.
- 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్ ని లోక్సభలో పొందుపరచనున్నారు. ఉదయం 9:30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పండితులు, సాధువులు పాల్గొనే ప్రార్థనా సభ జరుగుతుంది. ఈ ప్రార్థనా సమావేశంలో ఆది శివుడు, ఆదిశంకరులను పూజిస్తారు.
- ఆ తరవాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ జరుగుతుంది.
- ఆ తరవాత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు. రాజ్యసభలోని ప్రతిపక్ష నేత కూడా తన సందేశాన్ని వినిపిస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు, ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కాయిన్, స్టాంప్ విడుదల చేస్తారు. ఆ తర్వాత 2:30 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది.