న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.500 కోట్ల స్కీమ్ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది జులై 31 వరకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫేమ్ 2 స్కీమ్ ఆదివారంతో ముగిసింది. మార్చి 31 లోపు ఎలక్ట్రిక్ వెహికల్ను కొనుగోలు చేసిన వారు ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ పొందడానికి అర్హులు.
ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (ఈఎంపీఎస్ ) ను హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేసినవారికి రూ.10 వేల వరకు సబ్సిడీ దక్కుతుంది. 3.33 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే చిన్న సైజ్ త్రీవీలర్లు కొనుగోలుపై రూ.25 వేల వరకు, పెద్ద త్రీ వీలర్లకు అయితే రూ.50 వేల వరకు సబ్సిడీ దక్కుతుంది. ఈ స్కీమ్ కింద రూ.500 కోట్ల విలువైన రాయితీలను 4 నెలల పాటు ఇవ్వనున్నారు.