సారంగాపూర్, వెలుగు: నవజాత శిశువుల మరణాలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో పని చేసే ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కృషి చేయాలని డీఐవో నయనా రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని ఆలూరు గ్రామంలో నిర్వహించిన టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఏఎన్ఎం లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీకాల కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, గర్భిణులు, పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని సూచించారు.
నవజాత జననాల వారోత్సవంపై అవగాహన కల్పించి, ఈ నెల 15 నుంచి 21 వరకు ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. చలి తీవ్రత పెరగడంతో పిల్లలకు నిమోనియా సోకే అవకాశం ఉందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రికి పంపేలా అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ అబ్దుల్ జవాద్, పీహెచ్ఎన్ విమల, కృష్ణమోహన్ గౌడ్, శ్రీనివాస్, ఉషారాణి, ప్రేంసింగ్ పాల్గొన్నారు.
