ప్రేమ జంట మృతి : పెళ్లి చేసుకొని వస్తుండగా ప్రమాదం

ప్రేమ జంట మృతి : పెళ్లి చేసుకొని వస్తుండగా ప్రమాదం

ప్రేమ పెళ్లి విషాదాన్ని మిగిల్చింది. కలల కాపురాన్ని రోడ్డు ప్రమాదం అన్యాయం చేసింది. కామారెడ్డి జిల్లా మండలంలోని మోడేగాం గ్రామానికి చెందిన భట్టు ప్రభాకర్, మహిమ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల్ని ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. కాళ్లకు పూసిన పారాణి ఆరకముందే..నడిచిన ఏడడుగుల్ని మరువకముందే విధి ఆడిన వింతనాటకంలో ప్రేమికులు మృత్యువాత పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడేగాం గ్రామానికి చెందిన భట్టు ప్రభాకర్ (24) ఆరేళ్లుగా  హైదరాబాద్ లోని క్యాటరింగ్ పని చేస్తున్నాడు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నమహిమ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇద్దరు గురువారం హైదరాబాద్ లో వివాహం చేసుకుని బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సుదిగి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నసమయంలో గుర్తు తెలియని వాహనం నవదంపతుల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిమ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ కు  తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సదాశివ నగర్ పోలీసులు అత్యవసర చికిత్స కోసం ప్రభాకర్ ను నిజామాబాద్ కు  తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.