
హైదరాబాద్: న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్వేచ్ఛ తల్లి శ్రీదేవి స్పందించారు. స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. వయసులో చిన్నదైనా చదువు, జ్ఞానము, వ్యాఖ్యానంలో ఆమె దిట్ట అని గుర్తుచేశారు.
చిన్న వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివిందని, మీడియా రంగంలో కూడా చాలా గొప్పగా రాణించిందని తన కూతురి గురించి ఆమె చెప్పారు. నిన్న సాయంత్రం (శుక్రవారం) 4 గంటల వరకు స్వేచ్ఛ తమతో మాట్లాడుతూనే ఉందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణంపై తమకున్న అనుమానాలు పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేశామని స్వేచ్ఛ తల్లి వివరించారు.
కొందరి మాయమాటలు.. వలలో పడి స్వేచ్ఛ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నామని స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించారు. ఆమె పర్సనల్ లైఫ్కు సంబంధించిన నిర్ణయాలు ఆమెనే తీసుకునేదని, ఆమెకు ఇంకొకరు చెప్పే అవసరం లేదని స్వేచ్ఛ వ్యక్తిత్వం గురించి శ్రీదేవి చెప్పారు. స్వేచ్ఛ మృతికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా చేయాలని స్వేచ్ఛ తల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు.
ఓ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జవహర్ నగర్లోని ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు. స్వేచ్ఛకు పెళ్లయి 9వ తరగతి చదువుతున్న ఒక పాప కూడా ఉంది. భర్తతో విభేదాల కారణంగా ఆమె విడిగా ఉంటోంది.