రైతులను సొంత భూముల్లోకి పోనివ్వని ఎన్​హెచ్ఏఐ

రైతులను సొంత భూముల్లోకి పోనివ్వని ఎన్​హెచ్ఏఐ

రైతులను భూముల్లోకి పోనియ్యట్లే!

చౌటుప్పల్, వెలుగు: రైతుల భూముల్లోకి రైతులనే పోనియ్యట్లేదు హైవే అధికారులు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి వెంట భూములున్న రైతులు, కంపెనీలు, ఫామ్ హౌజ్లు, హోటళ్లు, ప్రైవేటు స్థలాల యజమానులు ఎవరైనా సరే వారి భూముల్లోంచి హైవే ఎక్కాలంటే అనుమతులు తీసుకోవాలంటూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది. అదీకాక నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ వరకు 171 కి.మీ. మేర హైవే–65వెంట ఉన్న భూములు, కంపెనీలు, ప్రైవేటు స్థలాల్లోకి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవని, ఆ దారులను తొలగించాలంటూ హైవే కాంట్రాక్టు సంస్థ జీఎమ్మార్ కు ఆదేశాలిచ్చింది. దీంతో జీఎమ్మార్ సిబ్బంది జేసీబీలతో హైవే వెంట ఉన్న దారులన్నింటికీ ట్రెంచింగ్ కొడుతున్నారు. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో హైవే వెంట ట్రెంచింగ్ కొట్టే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే హోటళ్లు, కంపెనీలు అని కూడా చూడకుండా రోడ్డు పక్కన గుంతలు తవ్వేస్తున్నారు.

2800 ఎకరాలు ఇచ్చినందుకు..
ఎనిమిదేళ్ల క్రితం రెండు లేన్లుగా ఉండి నిత్యం రక్తమోడుతున్న హైవేను నాలుగు లేన్లుగా విస్తరించేందుకుగానూ చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ వరకు సుమారు లక్ష మంది రైతులు, నిర్వాసితులు 2800 ఎకరాలు ఇచ్చారు. హైవే వెంట ఉన్న భూముల విలువ కోట్లల్లో ఉన్నా పరిహారం ఇచ్చింది లక్షల్లోనే. అలాంటి రైతులు, నిర్వాసితులు నాడు వాళ్లిచ్చిన స్థలాల్లోంచి తమకున్న మిగతా భూముల్లోకి వెళ్లడానికి అనుమతులు లేవంటూ ప్రస్తుతం ట్రెంచింగ్ కొడుతున్నారు. 2016లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. నాలుగేళ్లు అవుతున్నా చాలామందికి అవార్డు పెండింగ్లోనే ఉంది. ఇవీకాక కోర్టు కేసులు, వక్ఫ్ భూముల వివాదాలు ఉన్నాయి. ఇలా ఎంతోమందికి పరిహారం ఇవ్వకున్నా, వారు భూముల్లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలంటూ మెలిక పెడుతున్నారు.

విస్తరణ పూర్తి చేయకున్నా టోల్
హైదరాబాద్– విజయవాడ హైవే విస్తరణ పనులను 2009లో మొదలుపెట్టారు. 2012 నాటికి రోడ్డు విస్తరణను అరకొరగా పూర్తిచేసి డిసెంబరు 4 నుంచి టోల్ వసూళ్లు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏటా 10 శాతం టోల్ రుసుం పెంచి వాహనదారుల నుంచి దండుకుంటున్నా విస్తరణను మాత్రం పూర్తి చేయడం లేదు. వాహనదారులు, హైవే పక్కను ఉన్న గ్రామాల ప్రజలకు కల్పించాల్సిన వసతులను కల్పించడం లేదు. చౌటుప్పల్, చిట్యాల, నందిగామ, కేతేపల్లి మండలాల్లో విస్తరణ పనులను పూర్తి చేయలేదు. పలుగ్రామాల్లో జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది.

ఎన్హెచ్ఏఐ అనుమతి తప్పనిసరి
దేశంలోని ఏ హైవే నుంచైనా వ్యాపార సంస్థలు, కంపెనీలు, రైతులు ఎవరైనా రోడ్డు దిగి తమ స్థలాల్లోకి వెళ్లాలంటే ఎన్ హెచ్ఏఐ నుంచి అనుమతి తీసుకోవాలి. రోడ్డును ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా తవ్వొద్దని, హైవేపై వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో దారికి అనుమతులు ఇవ్వాలనేది ఎన్​హెచ్ఏఐ ఉద్దేశం. కేంద్ర మంత్రివర్గం దీనిపై 2013లో మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మేరకు దేశంలోని అన్ని హైవేలలో అనుమతులు ఇస్తున్నారు. రైతులు దారికి అనుమతులు తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చును రైతులు భరించలేరు. దాంతో చాలాచోట్ల వారి భూములను మినహాయిస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా రైతులను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్– విజయవాడ హైవేపై మాత్రం రైతుల భూములను కూడా వదలకుండా ట్రెంచింగ్ కొడుతున్నారు.

For More News..

క్రికెట్ లోకి సరికొత్త ఫార్మాట్..

జెట్టీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ..

మావోయిస్టులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..