
హైదరాబాద్, వెలుగు : సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యులు సంజయ్ దీపక్ రావు అలియాస్ వికాస్, ఆనంద్, అర్వింద్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మావోయిస్టు రిక్రూట్మెంట్, నిధుల సేకరణకు సంబంధించిన వివరాలతో చార్జ్షీట్ రూపొందించింది. నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో సోమవారం ఆ చార్జ్షీట్ను దాఖలు చేసింది. నిరుడు సెప్టెంబర్ 15న కేపీహెచ్బీ పీఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈ ఏడాది జనవరి3న ఎన్ఐఏ కేసు రీరిజిస్టర్ చేసింది. పోలీసులు సీజ్ చేసిన రివాల్వర్, ఫ్యాబ్రికేటెడ్ ఆధార్ కార్డులు, ల్యాప్టాప్, నగదుకు సంబంధించిన ఆధారాలను సేకరించింది. సంజయ్ దీపక్ రావు మావోయిస్టులతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టులతో కలిసి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహించేందుకు పథకం రచించారని తెలిపింది. ఇందు కోసం అవసరమైన సమావేశాలు జరిపారని, నిధులు, ఆయుధాలు సేకరించారని వివరించింది. వెస్టర్న్ ఘాట్స్ స్పెషల్ జోనల్ కమిటీ (మావోయిస్ట్) పేరుతో టెర్రరిస్ట్ క్యాంపులను నిర్వహించారని చార్జిషీట్లో వెల్లడించింది.