- మెరిసిన ఆటో, రియల్టీ షేర్లు
- నెక్స్ట్ టార్గెట్ 22,800?
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు నిఫ్టీ, సెన్సెక్స్ సోమవారం కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు, కొన్ని ఆటో కంపెనీల షేర్లు ర్యాలీ చేయడంతో దూసుకుపోయాయి. నిఫ్టీ సోమవారం 153 పాయింట్లు (0.68 శాతం) పెరిగి 22,666 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో 22,697 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని రికార్డ్ చేసింది. సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడి 74,743 దగ్గర ముగిసింది. నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా పెరగగా, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి.
మరోవైపు నిఫ్టీ బ్యాంక్ 48,700 లెవెల్ను మొదటిసారిగా టచ్ చేసింది. దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు ఎకానమీ మెరుగ్గా ఉండడంతో ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్పై పాజిటివ్గా ఉన్నారు. 200 కి పైగా షేర్లు సోమవారం 52 వారాల గరిష్టాన్ని టచ్ చేశాయి. ఏబీబీ ఇండియా, అవెన్యూ సూపర్మార్ట్స్, బాష్, కెనరా బ్యాంక్, కొచ్చిన్ షిప్యార్డ్, గ్లెన్మార్క్, గెయిల్ వంటి కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
ఇన్వెస్టర్లు ఏమంటున్నారంటే?
1) నిఫ్టీ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి బయటకొచ్చిందని, నిఫ్టీ బ్యాంక్ కూడా కొత్త గరిష్టాన్ని నమోదు చేసిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మార్కెట్ మరింత పెరగొచ్చని, కానీ మధ్య మధ్యలో కరెక్షన్ కూడా ఉంటుందని అంచనా వేశారు.
2) నిఫ్టీ ఎటువైపైనా భారీగా కదలొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు. 22,600 పైన కొనసాగితే 22,800 వరకు వెళ్లొచ్చని, దిగువకు వస్తే 22,300 వరకు పడొచ్చని పేర్కొన్నారు.
రూ.400 లక్షల కోట్లకు మార్కెట్ సైజ్..
బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.400 లక్షల కోట్లను టచ్ చేసింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు పెరుగుతుండడంతో మార్కెట్ సైజ్ రికార్డ్ లెవెల్కు చేరుకుంది. కిందటేడాది జులైలో మొదటిసారిగా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.300 లక్షల కోట్లు దాటింది. రూ.200 లక్షల కోట్ల మార్క్ను 2021 ఫిబ్రవరిలో, రూ. 100 లక్షల కోట్ల మార్క్ను 2014 లో టచ్ చేసింది.