రాత్రిపూట యూరియా బ్లాక్ దందా!.. వికారాబాద్ జిల్లా పరిగిలో వీడియోలు తీసి వైరల్ చేసిన రైతులు

రాత్రిపూట యూరియా బ్లాక్ దందా!.. వికారాబాద్ జిల్లా పరిగిలో వీడియోలు తీసి వైరల్ చేసిన రైతులు
  • అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

పరిగి, వెలుగు: తిండీతిప్పలు మాని యూరియా కోసం రైతులు.. ఎండనక వానానక క్యూలైన్లలో నానా కష్టాలు పడుతుంటే.. ఓవైపు వ్యాపారులు మాత్రం అక్రమంగా యూరియాను రాత్రిపూట బ్లాక్​లో​అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 

వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్​షాపు గోడౌన్​నుంచి శనివారం రాత్రి ఆటోలో యూరియాను అక్రమంగా తరలిస్తుంటే.. స్థానిక రైతులు వీడియో తీసి సోషల్​మీడియాలో  వైరల్​చేశారు. తాము ఉదయం నుంచి రాత్రి వరకు లైన్​లో నిలబడ్డ టోకెన్​ దొరకట్లేదని, కానీ వ్యాపారులకు మాత్రం రాత్రిపూట అమ్మేందుకు యూరియా ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. 

కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విజిలెన్స్, వ్యవసాయ​అధికారులు సైతం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఫర్టిలైజర్​షాపులు, గోడౌన్​లో ఉన్న యూరియా నిల్వలపై దాడులు నిర్వహించి, బ్లాక్ దందాను ఆపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.