
తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ మరోసారి బాక్సింగ్ ప్రపంచాన్ని గెలిచింది. వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన 50 కేజీ ఫైనల్లో పవర్ పవర్ఫుల్ పంచ్లు కొట్టిన జరీన్ 5-0 వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తి టామ్ (వియత్నాం)ను ఓడించింది. దాంతో, రెండుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్గా లెజెండ్ ఎంసీ మేరీకోమ్ సరసన నిలిచింది.75 కేజీ కేటగిరీ ఫైనల్లో లవ్లీనా బొర్గొహైన్ 5–2తో కైట్లిన్ పార్కెర్ (ఆస్ట్రేలియా)ను ఓడించి గోల్డ్ నెగ్గింది. ఈ టోర్నీలో ఇండియా మొత్తం నాలుగు బంగారు పతకాలు గెలుచుకుంది.
ఏడాది కిందటే వరల్డ్ చాంపియన్ అయ్యింది. ‘నిఖత్ ఎవరు?’ అని చులకన చేసిన లెజెండరీ బాక్సర్ మేరీకోమ్తో పాటు యావత్ బాక్సింగ్ ప్రపంచానికి తనెవరో అప్పుడే చాటి చెప్పింది మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్. అయినా ఆమెలో కసి తగ్గలేదు. ఆ విజయం గాలి వాటం కాదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్తో తన ఖలేజా చూపెట్టింది. అయినా ఆమెలో గెలుపు తపన తగ్గలేదు. తన పంచ్ పవర్ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి మళ్లీ చూపెట్టాలనుకుంది..! అంతే.. గతేడాది టర్కీలో తడాఖా చూపెట్టిన నిఖత్ ఈ సారి ఢిల్లీ గడ్డపై స్వర్ణ గర్జన చేసింది. ఎదురైన ప్రతి ఒక్కరినీ మట్టి కరిపించిన ఇందూరు అమ్మాయి.. మరోసారి వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆనందాన్ని నాలుగింతలు చేస్తూ టోక్యో ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ కూడా గోల్డ్ మెడల్ పట్టేసింది. ఇండియా 4 బంగారు పతకాలతో ఈ టోర్నీకి సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: మన బాక్సింగ్ బంగారం నిఖత్ జరీన్ మరోసారి వరల్డ్ చాంపియన్ అయింది. విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తన టైటిల్ నిలబెట్టుకున్న జరీన్ ఇండియన్ బాక్సింగ్కు తానే యువరాణి అని నిరూపించుకుంది. ఆదివారం జరిగిన 50 కేజీ కేటగిరీ ఫైనల్లో తిరుగులేని పెర్ఫామెన్స్ చేసిన నిఖత్ 5–0తో రెండు సార్లు ఏషియన్ చాంపియన్ అయిన ఎన్గుయెన్ తి టామ్ (వియత్నాం)ను చిత్తు చిత్తుగా ఓడించింది. రెండుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ బాక్సర్గా లెజెండ్ ఎంసీ మేరీకోమ్ సరసన నిలిచింది. మరోవైపు 75 కేజీ కేటగిరీలో స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఎట్టకేలకు ప్రపంచ కిరీటాన్ని అందుకుంది. గతంలో రెండుసార్లు బ్రాంజ్తో సరిపెట్టిన లవ్లీనా హోరాహోరీ ఫైనల్లో 5–2తో కైట్లిన్ పార్కెర్ (ఆస్ట్రేలియా)ను ఓడించి పసిడి గెలిచింది. శనివారం నీతు గాంగాస్ (48 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా గోల్డ్ నెగ్గారు. దాంతో, వరల్డ్ చాంపియన్షిప్స్లో ఇండియా తమ బెస్ట్ పెర్ఫామెన్స్ను రిపీట్ చేసింది. 2006లో ఇండియాలోనే జరిగిన టోర్నీలోనూ నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది.
తెలంగాణ పంచ్ అదుర్స్
వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నిఖత్ ఫైనల్లో అదే స్థాయిలో పెర్ఫామెన్స్ చేసింది. తొలుత వియత్నాం బాక్సర్ ఎటాక్ మొదలు పెట్టినా.. ఫ్యాన్స్ కేరింతలతో నిఖత్ ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడింది. ఖచ్చితమైన పంచ్లు విసిరిన జరీన్ అదే టైమ్లో అద్భుతమైన డిఫెన్స్తో మెప్పించింది. రింగ్లో పాదరసంలా కదులుతూ.. ప్రత్యర్థి పంచ్లను తప్పించుకుంది. దాంతో 5–0 స్కోరుతో తొలి రౌండ్ గెలిచింది.కానీ, రెండో రౌండ్లో ఎన్గుయెన్ పుంజుకుంది. ఎటాకింగ్ గేమ్ ఆడిన ఆమె 3–2తో ఈ రౌండ్ గెలిచి రేసులోకి వచ్చింది. దాంతో ఉత్కంఠ అమాంతం పెరిగింది. అప్పటికే ఇద్దరు బాక్సర్లు చెరోసారి వార్నింగ్ ఎదుర్కొన్నారు. ఫ్యాన్స్ ఉత్సాహపరుస్తుండగా ఆఖరి రౌండ్లో తెలంగాణ బాక్సర్ మళ్లీ జోరు పెంచింది. వియత్నాం బాక్సర్పై ముఖంపై పవర్ఫుల్ రైట్ క్రాస్ ఇవ్వడంతో స్టేడియం హోరెత్తింది. 8 కౌంట్ తర్వాత పోటీ కొనసాగగా ఎన్గుయెన్ కూడా బలమైన లెఫ్ట్ జాబ్ కొట్టడంతో నిఖత్ పైపెదవి చిట్లింది. దాంతో ఆందోళన రేకెత్తినా.. చివరి నిమిషంలో తెలివిగా ఆడుతూ మరికొన్ని షాట్లు కొట్టిన నిఖత్ టైటిల్ సొంతం చేసుకుంది.
అన్స్టాపబుల్
‘సీతాకోక చిలుకలా ఎగ రాలి. తేనెటీగలా కుట్టాలి’ బాక్సింగ్ గ్రేట్ ముహమ్మద్ అలీ చెప్పిన మాట బాక్సర్లందరికీ స్ఫూర్తి. ఫైనల్లో నిఖత్ జరీన్ ఆట చూస్తే మహ్మద్ అలీ మాటలే గుర్తొచ్చాయి. అలీ మాదిరిగా నిఖత్ బాక్సర్ మాత్రమే కాదు ఓ ఫైటర్. బాక్సింగ్ రింగ్లోనే కాకుండా.. బయటా ఆమెకు పోరాటం కొత్త కాదు. ముస్లిం కుటుంబంలో పుట్టిన నిఖత్ తొలుత బాక్సింగ్ను కెరీర్ను ఎంచుకోవడానికే ఓ యుద్ధం చేయాల్సి వచ్చింది. చుట్టాలు.. సమాజం వద్దన్నా.. పేరెంట్స్ సపోర్ట్తో బాక్సర్గా మారి టీనేజ్లోనే తన తడాఖా చూపెట్టింది. తర్వాత గాయాలు వెనక్కిలాగినా మనోధైర్యంతో ముందుకొచ్చింది. కెరీర్ కీలక టైమ్లో తాను ఆరాధించిన మేరీకోమ్ రూపంలోనే ఆమెకు మరో అడ్డుగోడ ఎదురైంది. గతేడాది వరల్డ్ చాంపియన్గా నిలిచి మేరీ నీడ నుంచి బయటకు వచ్చింది.
అప్పుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో సక్సెస్ అయిన నిఖత్ తాజా విజయంతో తన ఖ్యాతిని మరింత పెంచుకుంది. జరీన్ చాలా సులువుగా టైటిల్ నిలబెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నా.. దీని వెనుక ఎంతో కష్టం ఉంది. గతేడాది 52 కేజీల్లో టైటిల్ నెగ్గిన నిఖత్.. ఒలింపిక్స్ కోసం ఈసారి 50 కేజీలకు మారింది. ఒకేసారి 2–3 కేజీల బరువు తగ్గడం, కొత్త కేటగిరీలో కుదురుకోవడమే ఓ సవాల్. కానీ, 2024 ఒలింపిక్స్పై గురి పెట్టిన నిఖత్ ఇష్టంగా కష్టపడుతూ..ఓ యజ్ఞంలా లక్ష్యం దిశగా ముందడుగు వేస్తోంది. గతేడాది వరల్డ్చాంపియన్షిప్ గోల్డ్తో సెలబ్రిటీ హోదా వచ్చినా.. పొగడ్తలకు పొంగకుండా వెంటనే ప్రాక్టీస్లో నిమగ్నమైంది. కోచ్లు భాస్కర్ భట్, దిమిత్రి గైడెన్స్లో తన పంచ్లకు పదును పెట్టుకుంది. ఎటాకింగ్లో ముందు నుంచి బలంగా ఉన్న నిఖత్.. డిఫెన్స్తో పాటు టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకొని కంప్లీట్ బాక్సర్గా మారింది. అందుకే ఈ టోర్నీలో గోల్డ్ నెగ్గే క్రమంలో చాలా బలమైన ప్రత్యర్థులు ఎదురైనా అలవోకగా ఓడించింది. సొంతగడ్డపై అంచనాల భారం మోస్తూ.. వెంటవెంటనే బౌట్లు ఆడటం ఎవ్వరికీ ఈజీ కాదు. అందుకే ఈ విజయాన్ని నిఖత్ మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్కు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు నిఖత్ కెరీర్లో లోటుగా ఉన్నవి ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గోల్డ్ మెడల్సే. తను ఇదే జోరు కొనసాగిస్తే ఈ ఏడాది ఏషియాడ్తో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లోనూ గోల్డ్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాబోదు. అప్పటిదాకా నిఖత్ అన్స్టాపబుల్గా దూసుకెళ్లాలని ఆశిద్దాం!(హైదరాబాద్, వెలుగు)
ఈ మెడల్ ఇండియాది
వరుసగా రెండోసారి వరల్డ్ చాంపియన్ అయినందుకు, మరీ ముఖ్యంగా ఒలింపిక్ కేటగిరీలో గోల్డ్ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలో నాకు ఎదురైన టఫ్ కాంపిటేషన్ ఇదే. ఆఖరి బౌట్ కాబట్టి నా ఎనర్జీ, స్టామినా మొత్తం దారపోసి స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడాలనుకున్నా. గతేడాది గోల్డ్ కంటే ఈ టైటిల్ చాలా కఠినంగా వచ్చింది. వెయిట్ మారేందుకు చాలా కష్టపడ్డా. నేషనల్స్ తర్వాత తక్కువ టైమ్లోనే ప్రిపేర్ అయి గోల్డ్ నెగ్గినందుకు సంతోషంగా ఉన్నా. దీన్ని ఇండియన్స్కు, ఫ్యాన్స్ అందరికీ అంకితం ఇస్తున్నా. ఈ మెడల్ ఇండియాది. ఫ్యాన్స్ సపోర్ట్. నా కోచ్లు భాస్కర్ భట్, దిమిత్రి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైంది.
–నిఖత్ జరీన్