తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్లోనూ నిఖత్ పవర్ పంచ్లతో అదరగొట్టింది. ఫలితంగా గేమ్స్ కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 51 కేజీ సెమీస్లో నిఖత్ 7–0తో అనామిక (రైల్వేస్)పై గెలిచింది. తద్వారా ఫైనల్స్కు అర్హత సాధించింది. బౌట్ ఆరంభం నుంచే భిన్నమైన స్ట్రాటజీతో పంచ్లు విసిరిన నిఖత్.. అనామికకు ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. బలమైన హుక్ షాట్స్. అప్పర్ కట్స్తో విరుచుకుపడటంతో.. జడ్జిలు ఏకగ్రీవంగా నిఖత్ను విజేతగా ప్రకటించారు. శనివారం జరిగే ఫైనల్లో నిఖత్.. మీనాక్షి (హర్యానా)తో తలపడుతుంది. మరోవైపు 70 కేజీల బౌట్లో టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్ కూడా ఫైనల్కు క్వాలిఫై అయ్యింది. సెమీస్లో లవ్లీనా 7–0తో అంకుషిత (అస్సాం)ను ఓడించింది. జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు బర్మింగ్హామ్లో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి.
మోకాలి గాయంతో...
మరోవైపు ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఎంసీ మేరీకోమ్ (మణిపూర్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విమెన్స్ 48 కేజీ సెమీస్లో మేరీ గాయపడింది. దీంతో ట్రయల్స్ నుంచి వైదొలగడంతో పాటు గేమ్స్కూ దూరమైంది. యూత్ వరల్డ్ మాజీ చాంపియన్ నీతూ (హర్యానా)తో జరిగిన ఈ బౌట్ ఫస్ట్ రౌండ్లోనే మేరీ ఎడమ మోకాలు తిరగబడింది. చికిత్స తర్వాత బౌట్ను కొనసాగించే ప్రయత్నం చేసిన మేరీ.. ఒకటి, రెండు పంచ్లు విసిరింది. కానీ కాలి నొప్పి ఎక్కువ కావడంతో ఆమె బ్యాలెన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోయింది. బౌట్ను కొనసాగించే చాన్స్ లేకపోవడంతో ఆర్ఎస్సీఏ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్) ద్వారా నీతూ విజయం సాధించింది. రింగ్లో కింద పడిన తర్వాత మేరీ ఎడమకాలికి పెద్ద బ్యాండేజ్ వేశారు. తర్వాత స్కానింగ్ కోసం హాస్పిటల్కు తరలించారు.

