తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్కు గోల్డ్

తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్కు గోల్డ్

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ను మరో బంగారు పతకం వరించింది. తెలంగాణ ముద్దుబిడ్డ, భారత బాక్సర్ నిఖత్ జరీన్ మరో పసిడి పతకాన్ని సాధించింది. దీంతో  కామన్వెల్త్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో ఇవాళ భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు పెరిగింది. 48 – 50 కేజీల ఫ్లై వెయిట్ బాక్సింగ్ కేటగిరిలో ఉత్తర ఐర్లాండ్ కు చెందిన కార్లీ ఎంసీ నౌల్ ను ఓడించి గోల్డ్ మెడల్ ను నిఖత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇవాళ ఒక్కరోజే భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు పెరిగింది. బాక్సర్లు  అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్ రెండు బంగారు  పతకాలు సాధించగా, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హోస్ పాల్ స్వర్ణం సాధించాడు. ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ కు రజతం, రేస్ వాక్  విభాగంలో  సందీప్ కుమార్ కు కాంస్యం దక్కాయి. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 48 పతకాలను సాధించగా, వాటిలో 17 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 

ఫైనల్లోకి సింధూ.. 

కామన్వెల్త్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం అదరగొడుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధూ ఫైనల్ కి దూసుకెళ్లింది. సింగపూర్ షట్లర్ పై సింధు వరుస సెట్లు నెగ్గింది. జియామిన్ యో పై 21–19,21–17 తేడాతో ఘన విజయం సాధించింది. పదునైన షాట్లతో ప్రత్యర్థిని సింధు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ మాత్రం సింగపూర్ షట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. గ్రౌండ్ నలువైపులా సింధు ఆడింది.  రేపు ఫైనల్లో సింధు తలపడనుంది.