
అఫ్గానిస్తాన్లో జరుగుతున్నది చూసి ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ మహిళల గురించి ఆందోళన. ఇప్పుడే కాదు తాలిబన్లు అక్కడ చొరబడక ముందే బెదిరింపులు ఎదుర్కొంది ఆ దేశ మొదటి ఎయిర్ఫోర్స్ పైలట్ నిలోఫర్ రెహ్మని. పైలట్గా తిరుగులేని విజయాలను సాధిస్తూ.. మహిళల చుట్టూ ఉండే కట్టుబాట్లు దాటి యుద్ధ విమానాలు నడిపినందుకు తనకు, తన కుటుంబానికి తాలిబన్ల బెదిరింపులు తప్పలేదు. రహ్మాని అఫ్గానిస్తాన్లోని లోగర్లో పుట్టింది. బాల్యం అంతా పాకిస్తాన్లో గడిచింది. కొద్ది రోజుల తర్వాత కుటుంబంతో కలిసి అఫ్గానిస్తాన్ వచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు పైలట్ కావాలని కోరిక. అందుకు చాలా కష్టపడి అఫ్గాన్ ఎయిర్ఫోర్స్ 2010 ఆఫీసర్స్ ట్రైనింగ్కు సెలక్ట్ అయింది. 2012లో సెకండ్ లెఫ్టినెంట్గా అర్హత సాధించింది. ఆమె మొట్టమొదటి సోలో విమానం సెస్నా 182 అనే చిన్న ఫ్లయిట్. కానీ పెద్ద విమానాలు నడపాలని అడ్వాన్స్డ్ ఫ్లయిట్ స్కూల్కు వెళ్లింది. ఆ తర్వాత మిలిటరీ కార్గో ఫ్లయిట్ను నడిపింది.
చనిపోయిన, గాయపడిన సైనికులను మహిళలు తీసుకురావడం నిషేధం అనే కల్చర్ను రెహ్మని తుడిచి వేసింది. ఒక మిషన్లో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఎయిర్ఫోర్స్లో మహిళా పైలట్గా ఆమె అఛీవ్మెంట్స్ అఫ్గాన్ మీడియాలో వస్తుండేవి. అప్పుడు రెహ్మని కుటుంబానికి తాలిబాన్ల నుండి బెదిరింపులు వచ్చేవి.ఆమె ఆశయాలను చూసి, కెరీర్ గురించి తాలిబన్లు బెదిరించేవారు. అయినా రెహ్మని భయపడలేదు. పెద్ద విమానాలు నడిపి తన ధైర్యాన్ని నిరూపించింది. అఫ్గాన్ ఎయిర్ఫోర్స్లో సీ-130 అనే పెద్ద విమానాన్ని నడిపి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ గా మారింది. 2016 లో అఫ్గాన్లో ఆమె మిషన్ పూర్తయింది. తర్వాత అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లిపోయింది.