
ప్రజా తీర్పును గౌరవించాలంటూ ప్రధాని మోడీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు లేఖ రారు. ఈ లేఖలో నలుగురు సీఎంలు కేసీఆర్,మమతా బెనర్జీ,భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు తేజస్వీ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, షరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ సంతకాలు చేశారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను ఖండించారు. సిసోడియా అరెస్ట్ వెనుక పూర్తిగా రాజకీయ కుట్ర ఉందన్నారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడుకున్నవని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్తలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. సెంట్రల్ ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలలో ఉన్న నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు చేసి బీజేపీలో చేరిన తరువాత వారి కేసుల ప్రస్తావన ఎత్తడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ లతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. భారత్ ప్రజాస్వామ్య దేశం అని తాము భావిస్తున్నామని తెలిపారు.