నీరవ్​ మోడీ స్కాం రూ.13 వేల కోట్లు కాదు.. రూ.25 వేల కోట్లు

నీరవ్​ మోడీ స్కాం రూ.13 వేల కోట్లు కాదు.. రూ.25 వేల కోట్లు

కొల్లగొట్టింది రూ. 13 వేల కోట్లు కాదు.. రూ.25 వేల కోట్లు

ఫోరెన్సిక్‌‌ రిపోర్టులో వెల్లడించిన బీడీఓ
రెండేళ్ల క్రితం పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (పీఎన్‌‌‌‌బీ) స్కామ్‌‌‌‌ బయటికి వచ్చినప్పుడు దేశమంతా నివ్వెరపోయింది. బ్యాంకు సొమ్ము రూ.13,500 కోట్లను నీరవ్‌‌‌‌ మోడీ, ఇతడి బంధువు మెహుల్‌‌‌‌ చోక్సీ కొల్లగొట్టారని తెలియడంతో బ్యాంకింగ్‌‌‌‌రంగం షాకింగ్‌‌‌‌కు గురైంది. డొల్ల కంపెనీల ద్వారా మోడీ, అతని మనుషులు బ్యాంకు సొమ్మును దోచేస్తున్నప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. తవ్వినకొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఘటన జరిగాక పీఎన్‌‌‌‌బీ యాజమాన్యం ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిట్‌‌‌‌కు ఆదేశించగా, ఈ కమిటీ పలు సంచలన విషయాలను వెల్లడిచేసింది.  ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.28 వేల కోట్ల విలువైన 1,561 లెటర్స్‌‌‌‌ ఆఫ్ అండర్‌‌‌‌టేకింగ్స్‌‌‌‌ (ఎల్‌‌‌‌ఓయూ)ను పీఎన్‌‌‌‌బీ నీరవ్ మోడీ గ్రూప్‌‌‌‌కు ఇచ్చినట్టు బెల్జియన్‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌ కంపెనీ బీడీఓ బయటపెట్టింది. వీటిలో రూ.25 వేల కోట్ల విలువైన 1,381 ఎల్‌‌‌‌ఓయూలను మోసపూరితంగా ఇచ్చారని స్పష్టం చేసింది. 23 మంది ఎగుమతిదారులకు ఎల్‌‌‌‌ఓయూలను ఇవ్వగా, వీరిలో 21 మందిని మోడీ ‘కంట్రోల్‌‌‌‌’ చేశాడని తేలింది. 193 ఎల్‌‌‌‌ఓయూల ద్వారా అందిన రూ.ఆరు వేల కోట్లను బ్యాంకుకు చెల్లించడానికి దుర్వినియోగం చేశారని బీడీఓ వేలెత్తిచూపింది. పీఎన్‌‌‌‌బీ కుంభకోణం గురించి ఈ సంస్థ ఇది వరకే ఐదు మధ్యంతర నివేదికలు ఇచ్చింది. తాజాగా అందజేసింది చివరి నివేదిక. 329 పేజీలు ఉన్న ఈ ఫోరెన్సిక్‌‌‌‌ రిపోర్టు కాపీని ఒక విజిల్‌‌‌‌ బ్లోయర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ కన్సార్షియం ఆఫ్‌‌‌‌ ఇన్వెస్టిగేటివ్‌‌‌‌ జర్నలిస్ట్స్‌‌‌‌ (ఐసీఐజే)కు అందజేశాడు. ఇందులో భాగమైన ఇండియన్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ పత్రిక వివరాలను బయటపెట్టింది. బీడీఓ డ్రాఫ్ట్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ను పీఎన్‌‌‌‌బీ ఇది వరకే సీబీఐ, ఈడీ సహా పలు సంస్థలకు అందజేసింది.

ఆస్తులను తనఖా పెట్టలేదు..

విచారణలో భాగంగా బీడీఓ టీమ్‌‌‌‌ నీరవ్‌‌‌‌ మోడీ, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను వివరాలను పరిశీలించారు. ఇండియాలో వీరికి 20 వరకు ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానినీ బ్యాంకు లోన్లు పొందడానికి తనఖాగా పెట్టలేదు. ఒక్క నీరవ్‌‌‌‌ మోడీ పేరిట మనదేశంలో ఉన్న 15 ఆస్తుల విలువ రూ.1,300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటిని ఆఫీసర్లు జప్తు చేశారు. ఇతనికి విదేశాల్లో 13 స్థిరాస్తులూ ఉన్నట్టు గుర్తించారు. అంతేగాక ఐదు లగ్జరీకార్లు, బోటును చరాస్తులుగా గుర్తించారు. మోడీ  రూ.20 కోట్ల విలువైన 106 పెయింటింగులనూ కొన్నాడు. వీటిని ఎంఎఫ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, జామినీ రాయ్‌‌‌‌, జోగెన్‌‌‌‌ చౌదరి, రాజా రవివర్మ వంటి ఫేమస్‌‌‌‌ ఆర్టిస్టులు గీశారు. పీఎన్‌‌‌‌బీ స్కామ్‌‌‌‌ బయటపడ్డాక చోక్సీ, మోడీ  పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాలో, నీరవ్ మోడీ బ్రిటన్‌‌‌‌లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో నీరవ్ లండన్‌‌‌‌ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. తదనంతరం అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. ఇండియాకు అప్పగించే విషయమై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తదుపరి విచారణ వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడింది. నీరవ్‌‌‌‌ మోడీ సమీప బంధువు చోక్సీని అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది.  ఇతడు తమను రూ.44.1 కోట్లకు మోసం చేశాడని మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌‌‌‌ అండ్‌‌‌‌ సింధ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (పీఎస్‌‌‌‌బీ) కూడా ఇటీవల వెల్లడించింది. ఇతడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. బాకీ వసూలుకు చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీంతో కలుపుకుంటే చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపిపెట్టాడు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి