చెక్ డ్యామ్ పేల్చివేతపై రాజకీయ దుమారం .. కాలనీ రక్షణ కోసమేనంటున్న ఆఫీసర్లు

చెక్ డ్యామ్ పేల్చివేతపై రాజకీయ దుమారం .. కాలనీ రక్షణ కోసమేనంటున్న ఆఫీసర్లు
  • తప్పుడు నిర్ణయమని మండిపడ్డ మాజీ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి
  • చెక్ డ్యామ్ పేల్చివేతతో రైతులకు నష్టమంటూ వాదన
  • ఎమ్మెల్యే ఒత్తిడితోనే పేల్చివేశారని ఆరోపణలు

నిర్మల్, వెలుగు: చెక్​డ్యామ్ పేల్చివేత వ్యవహారం రాజకీయంగా రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు అనాలోచితంగా చెక్ డ్యామ్​ను పేల్చివేశారని, దీంతో రైతులకు నష్టం జరుగుతుందని ఇంద్రకరణ్​రెడ్డి ఆరోపిస్తున్నారు. ధర్నా చేయడం, కూల్చివేసిన చెక్​డ్యామ్​ను పరిశీలించి ఆందోళన చేపట్టడం రాజకీయంగా హీట్​పుట్టిస్తోంది. 

చెక్​డ్యామ్​ల నిర్మాణంతో పుష్కలంగా నీరు

జిల్లాలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నా నిరుపయోగంగా ఉండేవి. ఏటా వర్షాకాలంలో లక్షలాది క్యూసెక్కుల వరద స్వర్ణ ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వృథాగా పోయేది. ఈ నేపథ్యంలోనే ఈ వాగు పరివాహకంలో ఉన్న గ్రామాల రైతులకు సాగునీరు పూర్తిస్థాయిలో అందించేందుకు ఈ వాగుపై 10 చెక్ డ్యామ్ లను నిర్మించింది. సోన్ మండలం సాకెర వద్ద కూడా దాదాపు రూ.4 కోట్లతో మూడు మీటర్ల ఎత్తుతో ఓ చెక్​డ్యామ్ నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు పెరిగాయి. పంటలకు పుష్కలంగా నీరందుతోంది. పశువుల దాహార్తి తీరుతోంది. 

కాలనీ ముంపునకు పలు కారణాలు

అయితే ఈ చెక్ డ్యామ్ నిర్మించడంతో ఎగువనున్న బీఎన్ఆర్ కాలనీ ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు మూడేండ్లుగా స్వర్ణ వాగు వరద ఈ కాలనీలోకి చేరి మునిగిపోతోంది. దీంతో కాలనీ ముంపునకు గురికాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయితే ఈ కాలనీ స్వర్ణ వాగు పరివాహక లోతట్టు ప్రాంతంలో ఉండడం, కాలనీ నిర్మాణమే నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ముంపునకు గురవుతోందని అధికారులు నిర్ధారించారు.

 దీంతోపాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లన్నీ ఒకేసారి పైకెత్తడంతో వరద స్వర్ణ వాగు వైపునకు వస్తూ వాగు నుంచి ప్రవహించే నీటిని పైకి తోస్తోందని, ఫలితంగా కాలనీ ముంపునకు గురవుతోందని కూడా అధికారులు పేర్కొంటున్నారు. సాకెర వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ ఎత్తును తగ్గిస్తే కాలనీకి వరద ముప్పు తప్పుతుందని గుర్తించిన అధికారులు కొద్దిరోజుల క్రితం చెక్​డ్యామ్​కు కొలతలు పెట్టి గ్రెనేడ్లతో పేల్చి ఎత్తును తగ్గించారు. 

తీవ్రమవుతున్న రాజకీయ వివాదం

అయితే చెక్​డ్యామ్ పేల్చివేత వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో రాజకీయ వివాదానికి తెరలేపింది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చొరవతోనే  చెక్ డ్యామ్​ను అధికారులు అనాలోచితంగా పేల్చివేశారని ఇంద్రకరణ్​రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. చెక్​డ్యామ్​ఎత్తు తగ్గడంతో నీరు వృథాగా పోయి రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పేల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. డ్యామ్​ఎత్తును తగ్గించి రైతులను మోసం చేశారని మండిపడ్డార. 

ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే విలువైన చెక్ డ్యామ్​ను పేల్చివేశారని మండిప డ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఆయన ఇలాంటి అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీఎన్ఆర్ కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద ప్రమాదం ఉండదని, అలా చేయకుండా చెక్ డ్యామ్​ను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. వారంరోజుల్లో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే తాను ఇరిగేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.  

ప్రభుత్వ అనుమతితోనే పేల్చివేశాం

సాకెర చెక్​డ్యామ్​ను ప్రభుత్వ అనుమతితోనే పేల్చివేసాం. మూడేండ్ల క్రితమే చెక్​డ్యామ్ ఎత్తును తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే చెక్​డ్యామ్ పగలకపోవడంతో డైనమేట్లతో పేల్చివేసాం. కేవలం ఒక మీటర్ ఎత్తు మాత్రమే తొలగించాం. ఎత్తు తగ్గించినప్పటికీ నీరు నిల్వ ఉంటోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.  - అనిల్, ఇన్​చార్జి ఈఈ, ఇరిగేషన్, నిర్మల్ జిల్లా