- జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్
లక్ష్మణచాంద, వెలుగు: రైతులు యూరియాకు బదులుగా నానో యూరియా ఉపయోగించాలని నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, వ్యవసాయ సంచాలకుడు విద్యాసాగర్ సూచించారు. బుధవారం లక్ష్మణచాందలో నానో యూరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి రైతు వేదిక వరకు రైతులతో ర్యాలీ తీశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. యూరియాతో పోల్చితే నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరమవుతుందని, పంట ఉత్పత్తితోపాటు రైతుల ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు. నేల, నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో, కీటకాలు, తెగుళ్లను నివారిండడంలో నానో యూరియా కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. యూరియాతో పోల్చితే నానో యూరియా రవాణా, నిల్వ చేయడం ఎంతో సులభమన్నారు.
నానో ఏరియా ఉపయోగిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న రైతులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి వసంత్ రావు, ఏఈవోలు పవిత్ర, మౌనిక, సుస్మిత, రైతులు పాల్గొన్నారు.
