
నిర్మల్, వెలుగు: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసింది. రుణాల రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ కృషికి గాను హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, డీపీఎం జ్ఞాను, ఏపీఎం సుదర్శన్ అవార్డును అందుకున్నారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.