
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన మోసిన్ ఖాన్, పురాణ బజార్కు చెందిన ఆవిజ్ చావుస్, బుధవార్ పేటకు చెందిన సోఫియానుద్దీన్ నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా బైక్ల చోరీలకు పాల్పడుతున్నారు.
శనివారం వైఎస్సార్ కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంతో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ ముఠా గుట్టురట్టయ్యింది. వారి వద్ద నుంచి 4 బైక్లు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, శ్రీ కాంత్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.