స్టాండప్​ ఇండియా కింద రూ.40 వేల కోట్ల లోన్లు

స్టాండప్​ ఇండియా కింద రూ.40 వేల కోట్ల లోన్లు

స్టాండప్​ ఇండియా కింద రూ.40 వేల కోట్ల లోన్లు

న్యూఢిల్లీ : స్టాండప్​ ఇండియా స్కీమ్​ కింద గత ఏడేళ్లలో బ్యాంకులు రూ.40,700 కోట్ల విలువైన లోన్లు ఇచ్చాయని కేంద్ర ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. దీనివల్ల 1.80 లక్షల మంది ప్రయోజనం పొందారని వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఎంట్రప్రెనూర్​షిప్​ను ఎంకరేజ్​ చేయడానికి, బలహీనవర్గాలకు ఆర్థికంగా సాయపడటానికి, ఎకానమీని శక్తిమంతం చేయడానికి ఈ స్కీమును 2016 ఏప్రిల్​ ఐదున మొదలుపెట్టారు. దీనిని 2025 వరకు పొడగించారు. కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు లోన్లు ఇచ్చేలా ప్రభుత్వం బ్యాంకులను ఎంకరేజ్​ చేస్తుంది.

వీళ్లు తమ కలలను సాధించుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నదే ఈ స్కీమ్​ టార్గెట్​. వ్యవసాయం, తయారీ, సర్వీసులు, ట్రేడింగ్​ సెక్టార్​లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి లోన్లు ఇస్తారు. ఏకంగా 1.80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు లోన్లు ఇవ్వడం తనకు గర్వకారణమని, ఈ విజయం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నిర్మల అన్నారు. ఈ స్కీము వల్ల బిజినెస్​లు ఏర్పాటు చేయడం సులువుగా మారిందని అన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు స్టాండప్​ ఇండియా స్కీము చాలా కీలకం. ఎంతో మంది జీవితాలను బాగు చేసింది. పేదలకు సులువుగా లోన్లు వచ్చాయి. మహిళా ఎంట్రప్రెనూర్లు తమలోని సత్తాను చూపెట్టేందుకు స్టాండప్ ఇండియా సాయపడింది. చాలా మందికి ఉపాధి దొరికింది”అని ఆమె వివరించారు.

స్టాండప్​ ఇండియా.. చాలా ముఖ్యం... 

బలహీనవర్గాలకు స్టాండప్​ స్కీమ్​వరంలా మారిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్​ కరాద్​ అన్నారు. ‘నేషనల్​ మిషన్​ ఫర్​ ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​’కు ఇది వెన్నెముక వంటిదని కామెంట్​ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు, మహిళల బిజినెస్​లకు అవసరమైనప్పుడల్లా లోన్లు ఇవ్వాల్సిందిగా షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంక్స్​కు సూచించామని వెల్లడించారు. ఎంట్రప్రెనూర్లు, వారి ఉద్యోగులు, కుటుంబాల జీవితాలను మెరుగుపడేలా చేయడంలో ఈ స్కీమ్​ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ స్కీమ్​ కింద ఎంట్రప్రెనూర్లకు లోన్లు ఇప్పించడంతోపాటు వ్యాపారాల్లో తగిన సాయం అందించడానికి స్మాల్​ ఇండస్ట్రీస్​ డెవెలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా (సిడ్బీ) standupmitra.in పేరుతో ప్రత్యేక పోర్టల్​ను కూడా ఏర్పాటు చేసింది.

వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి సాయం ఎలా పొందాలో కూడా ఇది గైడ్​ చేస్తుంది. స్టాండప్​ఇండియా కింద ఒక ఎంట్రప్రెనూర్​కు రూ.పది లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్​ ఇస్తారు. ప్రతి బ్యాంకులో కనీసం ఒక్కరికైనా ఈ స్కీమ్​ కింద లోన్​ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా స్కీముకు అర్హులే కానీ వాళ్ల వ్యాపారంలో ఎస్సీ,ఎస్టీ, మహిళలకు కనీసం 51 శాతం షేర్​హోల్డింగ్​ ఉండాలి. ఇది వరకు డిఫాల్ట్​ అయి ఉండకూడదు. బ్యాంకు ద్వారా, సిడ్బీ పోర్టల్​ ద్వారా  లేదా  లీడ్​ డిస్ట్రిక్ట్​ మేనేజర్​ ద్వారా లోన్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.