ముంబై: క్రూడాయిల్ బారెల్ రేటు 100 డాలర్లు చేరడాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంగళవారం వెల్లడించారు. రష్యా-–ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దేశ చమురు అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటుండటంతో, రేటు పెరుగుదల మనకి ఛాలెంజేనని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు . క్రూడ్ రేటు పెరిగితే మన ఖర్చు ఎక్కువవడమే కాకుండా, దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగి ఇబ్బందులెదురయ్యే ఛాన్స్ ఉండటంతో, క్రూడ్ రేటు పెరుగుదలను జాగ్రత్తగానే మానిటర్ చేస్తున్నామని అన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీపై దీని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మంగళవారం నాటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎప్ఎస్డీసీ) మీటింగ్లో ఈ అంశంపై చర్చించినట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మంగళవారం బ్రెంట్ క్రూడ్ 96 డాలర్లను తాకడంపై డిస్కస్ చేశామన్నారు. రిటెయిల్రేట్ల విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ క్రైసిస్ వల్ల ట్రేడ్కు ఆటంకాలు లేవని, మన ఎగుమతిదారులు ఇబ్బంది పడకుండా చూస్తున్నామని మంత్రి నిర్మల పేర్కొన్నారు.
ఎల్ఐసీ ఐపీఓ....
సెబీ వద్ద పేపర్లు ఫైల్ చేసిన తర్వాత ఎల్ఐసీ ఐపీఓపై మార్కెట్లో ఆసక్తి పెరిగిందని చెబుతూ, ఐపీఓను పూర్తి చేయాలనే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మార్చి నెలలో జరిగే ఐపీఓ ద్వారా రూ. 60 వేల కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్. ఇది ప్లాన్ప్రకారమే జరుగుతుందని ఫైనాన్స్ మినిస్టర్ పేర్కొన్నారు.నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో కార్పొరేట్ గవర్నెన్స్ ఫెయిలైందనే ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్ఎస్ఈ విషయంలో సెబీ సరయిన చర్యలు తీసుకుందా, లేదా అనే అంశాన్నీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. కోలొకేషన్ సర్వర్ ఆరోపణలు బయటకు రావడంతో ఎన్ఎస్ఈ ఐపీఓను పోస్ట్పోన్ చేసుకోమని సెబీ చెప్పింది. 1994లో మొదలయిన ఎన్ఎస్ఈ ఇప్పుడు గ్లోబల్గా డెరివేటివ్స్ మార్కెట్లో నెంబర్1 లెవెల్కు ఎదిగింది. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామక్రిష్ణ, ఆమెకు సలహాదారుగా వ్యవహరించిన ఆనంద్ సుబ్రమణియన్లను దేశం వదిలి వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.