రెండు చోట్ల ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత

రెండు చోట్ల ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత
  • కొత్త వివాదంలో చిక్కుకున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ
  • ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
  • రెండు చోట్ల ఓటు ఎట్లా వేస్తారన్న ఇందిరా శోభన్

హైదరాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా నవీపేట్​మండలం పోతంగల్​లో ఓటు హక్కు ఉన్నా కూడా.. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ కవిత ఓటు వేశారు. అక్కడి ఓటర్​ లిస్ట్​లో పోలింగ్​బూత్​నెం.183, సీరియల్​ నెంబర్​361పై ఇప్పటికీ ఆమె పేరుతో ఓటు ఉంది. 2014, 2019 జనరల్​ ఎలక్షన్స్​తో పాటు సర్పంచ్​, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భర్త, అనిల్​ కుమార్​, అత్తామామలతో కలిసి ఆమె ఓటు వేశారు. ఇప్పుడు గ్రేటర్​ ఎన్నికల్లోనూ ఆమె ఓటు వేసి వివాదంలో చిక్కుకున్నారు. కవిత రెండు చోట్ల ఓటు వేయడంపై కాంగ్రెస్​ మండిపడింది. ఆధారాలతో సహా మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్​ ఫిర్యాదు చేశారు.  ఎలక్షన్​ కమిషన్​ వెబ్​సైట్​ ప్రకారం బోధన్​ నియోజకవర్గంలోని పోతంగల్​ అప్పర్​ ప్రైమరీ స్కూల్​లో కవిత ఓటరుగా ఎన్​రోల్​ చేసుకున్నారని, ఇప్పటికీ అక్కడే ఆమెకు ఓటు హక్కు ఉందని, అయినా కూడా బంజారాహిల్స్​లో కవిత ఓటెలా వేశారని ఆమె ప్రశ్నించారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఓటును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పోలింగ్​ సెంటర్​లోకి మామూలుగా ఫోన్లను తీసుకెళ్లనివ్వరని, కానీ, కవిత మాత్రం ఓటును బ్యాలెట్​ బాక్సులో వేసిన ఫొటోలు బయటపెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల రూల్స్​ను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చిన్నచూపు చూస్తూ ఓటును దుర్వినియోగం చేసిన కవితకు ఎమ్మెల్సీగా కొన‌‌సాగే నైతిక హ‌‌క్కు లేద‌‌న్నారు. క‌‌విత ఓటు వేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, పోతంగల్​లో ఓటు ఉన్నా హైదరాబాద్​లో రెండో ఓటు ఎలా వేశారని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్​ కూతురే ఇట్ల రెండు చోట్ల ఓటు వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.