
- క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్, గల్ఫ్ మోసాలపై ఫోకస్
- పర్మిషన్లేని చిట్ఫండ్ వ్యాపారులపై కేసులు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లాలో తన మార్కు చూపిస్తూ అక్రమాలకు చెక్ పెడుతున్నారు. గతేడాది అక్టోబర్లో నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగనెవార్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మార్చి 10 తర్వాత రెగ్యులర్ సీపీగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో సమర్థవంతంగా పనిచేసే పోలీస్ స్టాఫ్ ను స్పెషల్ ‘దర్బార్’ పేరుతో సన్మానిస్తున్నారు. అవినీతి చేస్తున్న ఆఫీసర్లను ఇంటికి సాగనంపుతున్నారు. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.
ప్లాన్ లీక్ కాకుండా యాక్షన్లోకి
సిటీలో ఇసుక రవాణా, మొరం ట్రాన్స్పోర్టుకు అండగా ఉంటున్న ట్రాఫిక్ ఏసీపీ నారాయణపై డీజీ ఆఫీస్కు సీక్రెట్ రిపోర్టు పంపారు. దీంతో ఆయనను ఈ నెల 8న జిల్లా నుంచి ట్రాన్స్ ఫర్ చేశారు. జాబ్స్ ఇప్పిస్తానని రూ. లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన రుద్రూర్ కానిస్టేబుల్ సిద్ధిరామ్ చిన్నయ్యపై కేసు నమోదు చేసి ఈనెల 2న సస్పెండ్ చేశారు. లంచాల వసూలు చేస్తున్నట్లు గుర్తించి కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గజానంద్ జాదవ్పై వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు నుంచి సంజాయిషీ కోరారు. దీంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న తొమ్మిది మంది ఎస్ఐలకు మెమోలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి ఠాణా పనితీరుపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎస్బీ నివేదికలు తెప్పించుకొని సిబ్బందిపై పూర్తి కంట్రోల్ సాధించారు.
హైలెట్గా చీటీ వ్యాపారులపై రైడ్స్
ప్రజల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరా చేసుకొని వడ్డీ దందా చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. గత నెల జిల్లా వ్యాప్తంగా15 మంది పై కేసులు నమోదు చేసి రూ. 85 లక్షల సొమ్మును కోర్టులో డిపాజిట్ చేశారు. 1,435 ప్రామిసరీ నోట్లు, 30 బాండ్ పేపర్స్, 43 రిజిస్ట్రేషన్ సేల్డీడ్స్తో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన 31 పేపర్స్ కోర్టుకు అందజేశారు. 80 మందిని మోసం చేసి రూ.లక్షలు ఎగ్గొట్టిన మహిళ, ఐదుగురు గల్ఫ్ఏజెంట్లను నందిపేటలో గుర్తించి జైలుకు పంపారు. క్రికెట్బెట్టింగ్రాకెట్లో ఎనిమిది మందిపై కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేయించారు. కాలేజీ స్టూడెంట్స్ ఉండే హాస్టల్స్లో గంజాయి ఆనవాళ్లు గుర్తించడానికి తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలు ఈజీగా గుర్తించడానికి వారి ఫింగర్ ప్రింట్, ఆధార్, ఫోన్ నంబర్ల సేకరణ మొదలుపెట్టారు.
యాక్సిడెంట్ల నివారణకు ప్రయారిటీ
ఎన్హెచ్44 పై పెర్కిట్ బైపాస్, కరీంనగర్ అండర్ పాస్ జంక్షన్ వద్ద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నట్లు గుర్తించిన సీపీ సాయి చైతన్య ఫీల్డ్ విజిట్ చేసి మార్పులు సూచిస్తూ హైవే అథారిటీకి పది రోజుల క్రితం లెటర్ పంపారు. మైనర్లకు వెహికల్స్ ఇచ్చి బయటకు పంపుతున్న పేరెంట్స్కు జరిమానాలు విధిస్తున్నారు. వివిధ నేరస్తుల జాడ తెలుసుకోడానికి వెహికల్స్చెకింగ్ పెంచారు. కొన్ని చోట్ల ఆయనే చెకింగ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత హోటల్స్ క్లోజ్ చేయిస్తున్నారు.
పట్టించుకోని 50 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. యూత్ మిడ్నైట్ తిరుగుళ్లను నియంత్రించారు. నగరంలో రోడ్ ఆక్రమణలతో వెలిసిన షాప్లను తొలగించారు. పోలీస్ సిబ్బంది మంచి చెడులు దర్బార్ ద్వారా తెలుసుకోవడమే కాకుండా గతంలో పనిచేసిన సీపీలకు భిన్నంగా సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటూ ప్రజలకు చేరువవుతున్నారు.