
- ఇష్టానుసారంగా ఫీజుల పెంపు
- బుక్స్, యూనిఫాం, షూ అంటూ ప్రత్యేక రేట్లు
- పేరెంట్స్ కమిటీ జోక్యం లేకుండానే నిర్ణయాలు
- జిల్లాలో 471 ప్రైవేట్ స్కూళ్లలో 1.60 లక్షల విద్యార్థులు
- పట్టించుకోని విద్యా శాఖ అధికారులు
నిజామాబాద్, వెలుగు : ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలాయి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంతోపాటు బుక్స్, యూనిఫాం, షూలకు ప్రత్యేక రేట్లు పెట్టి దోచుకుంటున్నాయి. పేరెంట్స్ కమిటీ ఆమోదం లేకుండానే రేట్లు పెంచి ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. సర్కార్ బడుల్లో సకల సౌకర్యాలు ఉన్నా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లపై ఆసక్తి చూపుతూ మోయలేని ఆర్థిక భారంతో నలిగిపోతున్నారు. తనిఖీలు చేయాల్సిన విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
బుక్స్ పేరుతో లూటీ
జిల్లాలో మొత్తం 471 ప్రైవేట్ స్కూళ్లు ఉండగా, 1,60,523 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. హైటెక్ లాంటి పేర్లతో పేరెంట్స్ను ఆకర్శిస్తుండడంతో పేరెంట్స్ బోల్తాపడుతున్నారు. ఫీజులు కడితేనే పిల్లలకు చదువొస్తుందని, ఎక్కువ గంటలు స్టడీ చేస్తేనే మార్క్స్ స్కోర్ చేస్తారని నమ్మి ప్రైవేటు స్కూళ్ల వైపు వెళ్తున్నారు. పేరెంట్స్ బలహీనతే ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది. సర్కార్ బడుల్లో పాఠ్యపుస్తకాలు రూ.వందల్లో ఉండగా, ప్రైవేటు బడుల్లో రూ.5 వేల నుంచి రూ.13 వేలు దాకా వసూలు చేస్తున్నారు.
రకరకాల సిలబస్ పేర్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ సదుద్దేశంతో ఇచ్చిన వెసులుబాటుతో స్కూల్ రూమ్స్లోనే సుమారు 8 లక్షల బుక్స్ అమ్మారు. స్టూడెంట్స్ సంఖ్యను బట్టి చూస్తే కేవలం బుక్స్ అమ్మకాల విలువ దాదాపు రూ.వంద కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మార్కెట్లో రూ.300 దొరికే షూస్ కు రూ.800, రెండు జతల యూనిఫాంలు, బెల్ట్, టై తదితర వాటిపేర్లతో పేరెంట్స్ నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన మరో రూ.50 కోట్లు ఆర్జిస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ఫీజును ఈఏడాది 20 శాతం పెంచేశారు.
పర్మిషన్లు లేకుండానే అడ్మిషన్లు..
కొన్ని బడులు అనుమతిలేకుండా అడ్మిషన్లు తీసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధిక శాతం ప్రైవేట్ స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్ లేవు. మార్నింగ్ ప్రేయర్ను క్లాస్ రూముల్లోనే ముగిస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ల నుంచి ఫిర్యాదు వెళ్తేగానీ కదలని డీఈవో అశోక్ ఆర్మూర్ రోడ్డులోని చైతన్య స్కూల్కు పర్మిషన్లేదని ప్రకటించారు. అర్సాపల్లి లోని ప్రైమ్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సీకి ఏడో తరగతి వరకు పర్మిషన్ ఉండగా, ఈఏడాది ఎనిమిదో తరగతి అడ్మిషన్లు తీసుకోవడం విశేషం. నిజామాబాద్ ఎంఈవో వీఎన్గౌడ్ ఈ నెల 18న విచారణ నిర్వహించి డీఈవోకు రిపోర్టు పంపారు. అడ్మిషన్లు తీసుకొని ఫీజులు కట్టిన పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
అనుమతులు కన్ఫర్మ్ చేసుకోవాలి
ప్రైవేట్ స్కూల్స్కు పర్మిషన్లు ఉన్నాయా? లేదా? అని పేరెంట్స్ నిర్ధారించుకోవాలి. అనుమతి లేని బడుల్లో పిల్లలను చేర్పించొద్దు. పర్మిషన్ లేని పాఠశాలలు ఉంటే వివరాలు తెలుపండి.
డీఈవో అశోక్