
- మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు
- బెయిల్కు, కొడుకు పరీక్షలకు సంబంధం లేదన్న జడ్జి
- కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత
- బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ
- ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
- సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని తీర్పులో వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. కొడుకుకు పరీక్షలున్నాయంటూ ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పై ఈడీ అభ్యంతరాలు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. తన చిన్న కొడుకుకు 11 వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పీఎంఎల్ఏ 45 (1) ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది.
దర్యాప్తునకు ముందు సాక్ష్యాలను నాశనం చేయడానికి కవిత తన ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొంది. నోటీసులు అందిన తర్వాత డిజిటల్ డివైజ్ లలోని సమాచారాన్ని తొలగించినట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్లో వెల్లడైందని తెలిపింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని, బెయిల్ వస్తే అదే తీరును కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 1, 4 వ తేదీల్లో ఈ పిటిషన్ పై ఇరువైపులా సుదీర్ఘంగా వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా తీర్పును సోమవారానికి (మార్చి 8) రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇందులో భాగంగా సోమవారం 21 పేజీలతో తీర్పు వెలువరించారు. వాది, ప్రతివాదులతోపాటు తీహార్ జైలు సూపరింటెండెంట్కు ఈ మెయిల్ ద్వారా ఈ కాపీని అందజేశారు. ఇందులో పిల్లల ఎగ్జామ్స్ కు సంబంధించిన ఆందోళనను పరిష్కరించడానికి తల్లే సరైన ప్రత్యామ్నాయం అన్న ‘బలవంతపు కారణం’తో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, సెక్షన్ 45 (1) అనేది మైనర్లు, అమాయకులు, పలు నేరాల్లో బలిపశువులు, మోసపోయిన మహిళకు వర్తిస్తుందని, కానీ కవిత లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ కేసులో బలిపశువు అయినట్టు భావించడంలేదని స్పష్టం చేసింది.
కొడుకు ఎగ్జామ్స్.. సరైన కారణం కాదు
మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కొడుకు ఎగ్జామ్స్ అనేది సరైన కారణం (బలవంతపు కారణం) కాదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే. కవిత భర్త అనిల్.. మైనర్ తండ్రిగా పిటిషనర్ తరపున వ్యాజ్యాన్ని దాఖలు చేయడంలో బిజీగా ఉన్నారనే వాదన కూడా నమ్మదగిందిగా లేదని పేర్కొంది. అప్లికేషన్ లో ఆయన పాత్ర ఎంత వరకు ఉందనే విషయాన్ని చూపలేదని, కొడుకు పరీక్షలకు సంబంధించిన ఆందోళన తన ప్రాధాన్యతగా తండ్రిలో కనిపించడం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జామ్స్ రాస్తున్న కొడుకు వయసు 16 ఏండ్లని, అలాగే ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని పేర్కొంది.
తండ్రి, సోదరుడు, చిన్నమ్మలు పరీక్ష రాసే పిల్లాడికి ఎందుకు నైతిక మద్దతు కల్పించలేరనే దానికి సరైన సమాధానం లేదని తెలిపింది. 19 ఏండ్ల వయసున్న కవిత పెద్ద కొడుకు తల్లిదండ్రులకు దూరంగా స్పెయిన్ లో చదువుకుంటున్నాడని, అలాంటప్పుడు మరో కొడుకు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల మద్దతుతో ఎందుకు చదువుకోలేడని ప్రశ్నించింది. భౌతికంగా తల్లికి దూరంగా ఉండి చిన్న కొడుకు పరీక్షలు రాయలేడా? అని ప్రశ్నించింది.
కవితను బలిపశువుగా భావించలేం
లిక్కర్ స్కాంలో కవితను బలిపశువును చేశారనే వాదనతో తాము ఏకీభవించడం లేదని కోర్టు పేర్కొంది. వెల్ఎడ్యుకేటెడ్ అయిన కవితకు సెక్షన్ 45 (1) ప్రకారం.. ఎలాంటి వెసులుబాటు కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. వాదనల సందర్భంగా కవిత అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చిన అంశాలపై తీర్పులో స్పష్టత ఇచ్చింది. సౌమ్య చౌరాసియా (సుప్ర) కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కోర్టు గుర్తు చేసింది. సెక్షన్ 45 ప్రొవిజన్స్ ను తప్పనిసరిగా, విధిగా భావించలేమని పేర్కొన్నట్టు తెలిపింది.
మైనర్లు, అమాయకులు, పలువురి చేతిలో బలిపశువుగా మారిన వారి విషయంలో సానుభూతి చూపాలని, అంతేగానీ నేడు కొందరు విద్యావంతులు, ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు వ్యాపారంలో ఉన్నవారిపై కాదని తీర్పులో పొందుపరిచినట్టు చెప్పింది. ఇదే కోవలో కవిత కూడా ఉన్నారని పేర్కొంది. కవిత వెల్ ఎడ్యుకేటెడ్అని పేర్కొంది. ఆమె బ్యాచిలర్ ఇన్ ఇంజినీరింగ్, మాస్టర్ ఇన్ సైస్స్ డిగ్రీ కోర్సులను ఉన్నతమైన వర్సిటీల్లో పూర్తి చేసినట్టు గుర్తు చేసింది. అలాగే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మాజీ ఎంపీగా, లోక్ సభ కమిటీల్లో పని చేశారని పేర్కొంది.
ఉప రాష్ట్రపతి, లోక్ సభ ప్రతినిధులతో కలిసి కవిత.. కొలంబియా, బ్రెజిల్, బెల్జియం సందర్శించారని వెల్లడించింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్ తో సేవలందించారని తెలిపింది. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు తెలంగాణ స్టేట్ కమిషనర్ గా చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆమె నిలిచారని పేర్కొన్నది. ఈ పై అంశాల నేపథ్యంలో కవితను ఏవిధంగానూ బలిపశువుగా భావించలేమని స్పష్టం చేసింది. అలాగే కవిత వెల్ ఎడ్యుకేటెడ్, సొసైటీలో వెల్ ప్లేస్డ్ ఉమెన్ అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదని పేర్కొంది. కవితపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని.. ఈడీ ఇంకా దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టాల్సిన ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
నేడు ట్రయల్ కోర్టు ముందుకు కవిత
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో మంగళవారం ఆమెను కోర్టు ముందు హాజరుపరుచనున్నారు. ఈడీ అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడీషియల్ రిమాండ్విధించారు. అనంతరం ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు.
14 రోజులుగా ఆమె జైల్లోనే ఉంటున్నారు. మంగళవారంతో కవిత కస్టడీ ముగియనుండగా.. ఆమెను మంగళవారం కోర్టు లో ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే, ఆమె పెట్టుకొన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను సోమవారం ట్రయల్ కోర్టు తోసిపుచ్చడంతో.. మంగళవారం ఆమెను నేరుగా కోర్టులో హాజరుపరుస్తారా? లేక ఆన్ లైన్ లో ప్రొడ్యూస్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కవిత జ్యుడీషియల్ రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16 న వాదనలు జరుగనున్నాయి.
సీబీఐ విచారణపై వాదనలు రేపు
తీహార్ జైల్లో ఉన్న తనను విచారించేందుకు సీబీఐకి అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది. సీబీఐ విచారణకు అనుమతివ్వడంపై గతవారం కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్ చేయాలని అందులో కోరారు. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, దీనిపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను10 వ తేదీకి వాయిదా వేసింది.