
- కోటి మంది ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ, చిన్న చిన్న కారణాల వలన డైరెక్ట్ ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్నవారికి మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. మార్చి, 2010 కంటే ముందు అందుకున్న ట్యాక్స్ డిమాండ్ నోటీసులను కేంద్రం రద్దు చేయనుంది. రూ.25 వేల లోపు ఉన్న ట్యాక్స్ డిమాండ్ నోటీసులకు ఇది వర్తిస్తుంది.
అధికారులు ఇటువంటి డిమాండ్ నోటీసులను ఇక నుంచి పట్టించుకోరు. అలానే ఏప్రిల్, 2011 నుంచి మార్చి ,2015 మధ్య రూ.10 వేలు లేదా అంత కంటే తక్కువ ట్యాక్స్ అమౌంట్ కోసం డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి కూడా ప్రభుత్వం ఊరట కలిపించింది. ఇటువంటి ట్యాక్స్ డిమాండ్స్కు స్పందించక, బకాయి పడిన వారిని అధికారులు ఇక నుంచి పట్టించుకోరు.
ట్యాక్స్ డిమాండ్ బకాయిలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో సుమారు కోటి మంది ట్యాక్స్పేయర్లకు మేలు జరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. కోటి మందికి ఇచ్చిన ట్యాక్స్ డిమాండ్ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్టు బడ్జెట్ స్పీచ్లో పేర్కొన్నారు. ‘వెరిఫై కాని, పరిష్కారానికి మార్గం లేని, అర్థం పర్థం లేని కారణాలతో ఏకంగా 1962 నాటి నుంచి అనేక ట్యాక్స్ వివాదాలు కొనసాగుతున్నాయి.
నిజాయితీ పరులైన పన్ను చెల్లింపుదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని సీతారామన్ పేర్కొన్నారు. రీఫండ్స్ ఇవ్వడంలో అడ్డుగా మారాయని చెప్పారు. ప్రభుత్వం ఎంత చక్కగా డేటా బేస్ను వాడుకుంటుందో తెలియజేసే అంశమిదని ఎన్.ఏ షా అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ సందీప్ షా అన్నారు.