వరంగల్ రూరల్, వెలుగు: కొత్త సంవత్సరం అలా మొదలైందో లేదో రాష్ట్రంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ క్యాంపెయిన్ జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రెండు, మూడు వారాలపాటు సైలంట్గా ఉన్న పార్టీలు, క్యాండిడేట్లు ఒక్కసారిగా ప్రచారంలో బిజీ అయ్యారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఒక్క అడుగు ముందుకేసి సై అంటే సై అంటున్నాయి. లెఫ్ట్ పార్టీలు, టీజేఎస్, యువ తెలంగాణ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఢీ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటు ఎన్రోల్మెంట్ గడువు పూర్తయినా ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎక్కడా ప్రచారంలో కనిపించడంలేదు. దీంతో ఈ ఎలక్షన్లు జరగనున్న జిల్లాల్లోని లీడర్లు, మెయిన్ కేడర్ అయోమయంలో పడ్డారు.
కాంగ్రెస్ తప్ప ప్రధాన పార్టీల్లో క్లారిటీ
రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జనాలచూపు రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లపై పడింది. అన్ని పార్టీలు వీటిని చాలెంజ్గా తీసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎప్పటినుంచో ప్రచారం మొదలుపెట్టారు. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ బరిలో.. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఉంటున్నారు. వారి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పల్లాను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని బరిలో దింపారు. ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్రావు మరోసారి పోటీలో ఉంటున్నారు. కమలం చీఫ్ బండి సంజయ్, ఇతర పెద్ద లీడర్లు వారి అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. లెఫ్ట్ పార్టీల నుంచి ఉమ్మడి వరంగల్లో సీనియర్ జర్నలిస్ట్ జయసారథి, ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యారు.
మూడు నెలల ముందునుంచే జనాల్లో..
ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ల కోసం టీజేఎస్ నుంచి కోదండరామ్, యువ తెలంగాణ పార్టీ క్యాండిడేట్గా రాణిరుద్రమ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న మూడు నెలల ముందునుంచే జనాల్లో ఉంటున్నారు. కోదండరామ్, రాణిరుద్రమ ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు పెడుతూ తమనే గెలిపిచాలని కోరుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మల్లన్న ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా జనాల్లోకి వచ్చారు. 1650 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి కేసీఆర్ సర్కార్ గ్రాడ్యుయేట్లకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఇండిపెండెంట్లుగా చెరుకు సుధాకర్రెడ్డి ఇతర అభ్యర్థులు తమకు బలమున్నచోట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎటుచేసి ఈ రెండుస్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ క్యాండిడేట్లు ఎవరనేది డిసైడ్ చేయట్లేదు. అందుకే ఎక్కడా కాంగ్రెసోళ్లు కనిపిస్తలేరు.
కాంగ్రెస్లో ఇంటి పోరు..
అన్ని పొలిటికల్ పార్టీలు, ఇండిపెండెంట్లు 3..4..నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ ఎలక్షన్స్పై ఫోకస్ పెట్టగా, కాంగ్రెస్ లో మాత్రం ఇంకా ఇంటి పోరు జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ తన పోస్టుకు రిజైన్ చేసినప్పటి నుంచి ఆ పీఠం గొడవ తప్పించి.. మిగతా అంశాలపై ఫోకస్ తగ్గినట్లు ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటోంది. మొదట్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేరు వినిపించినా సడెన్గా జీవన్రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ ఎంపిక పోస్ట్పోన్ చేసినట్లు ఢిల్లీ లీడర్లు ప్రకటించారు. అప్పటి దాకా పీసీసీ చీఫ్గా ఉత్తమ్ టీం పనిచేస్తుందని చెప్పారు. ఇదిఇలా ఉంటే.. దుబ్బాకలో ఓడిపోవడానికి కారణం క్యాండిడేట్ను ముందే ప్రకటించకపోవడం అంటూ ఇటీవల నాగార్జున సాగర్ బైపోల్కు ఆ పార్టీ హైకమాండ్ జానారెడ్డి పేరును కన్ఫమ్ చేసింది. అంతకుముందే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపై మాత్రం కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ లీడర్లు, మెయిన్ కేడర్ పరేషాన్ అవుతోంది.