
- ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీటింగ్కు గైర్హాజరు
- సంవత్సరం వరకు మళ్లీ అవకాశం లేదన్న అధికారులు
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపల్ పాలకవర్గంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శుక్రవారం చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస మీటింగ్కుమెజార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఆర్డీవో అనంత రెడ్డి తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఏడాది వరకు అవకాశం లేదని పేర్కొన్నారు. సిద్దిపేట ఆర్డీవో అనంత రెడ్డి స్పెషల్ ఆఫీసర్గా వచ్చి ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు కౌన్సిలర్లందరూ హాజరు కావాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన జుబేదా ఖతూన్, ఆడెపు నరేందర్ కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు చెవిటి లింగం, టి. లీలా, యం. తార, ఉడుముల ఇన్నమ్మ, సందుల సురేశ్ లు అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్లో పాల్గొనడానికి హాజరయ్యారు. మున్సిపల్లో 12 మంది కౌన్సిలర్లకు 9 మంది హాజరయితే అవిశ్వాసం నెగ్గేది. కానీ ఏడుగురే రావడంతో మరికొంత సమయం కావాలని హాజరైన కౌన్సిలర్లు ఆర్డీవోను కోరారు. దీంతో ఒంటిగంట వరకు వాయిదా వేశారు.
అయినప్పటికీ కోరానికి కావాల్సిన కౌన్సిలర్లు రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. సరైనంత మంది సభ్యులు లేనందున సమావేశం డిజాల్వ్ అయినట్లుగా ప్రకటించారు. చైర్పర్సన్ ఎ. స్వరూపరాణి, వైస్చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డిలపై ప్రకటించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు.
ఏడాది నుంచి ముసలం
గత సంవత్సరం డిసెంబర్ నెలలో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎ. స్వరూపరాణి, వైస్ చైర్మన్నిమ్మ రాజీవ్రెడ్డిలపై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్కు చెందిన అయిదుగురు, కాంగ్రెస్కు చెందిన అయిదుగురు మొత్తం పది మంది కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్కు అవిశ్వాస నోటీసును జనవరి 2న 9 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అందజేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 19న మీటింగ్ను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో కౌన్సిలర్లందరికి అవిశ్వాసానికి సిద్ధంగా ఉండాలని నోటీసులు అందజేశారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ఎన్నికల్లో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఎలాగైనా మున్సిపల్ను బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు ఇద్దరు ఇండిపెండెంట్లను కలుపుకుని చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి బల్దియాలో రోజుకో తీరుగా అసమ్మతి మొదలైంది. చైర్పర్సన్ పోస్టును తమకు కేటాయించాల్సిందిగా ఇండిపెండెంట్గా గెలుపొందిన జుబేదా ఖతూన్ పట్టుబట్టింది.
.చైర్పర్సన్ విషయంలో చెరో రెండున్నర సంవత్సరాలుగా ఉండాలని నిర్ణయించి సముదాయించడంతో చైర్పర్సన్గా ఎ. స్వరూపరాణి శ్రీధర్ రెడ్డిని ఎన్నుకున్నారు. అయిదో వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన బీఆర్ఎస్కు చెందిన ఆడెపు నరేందర్ను హైదరాబాద్ క్యాంపులో ఉంచారు. ఆయనకు వైస్ చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషయంలో మున్సిపల్ మీటింగ్లో పేరును మార్చి నిమ్మ రాజీవ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అప్పటి నుంచి ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులను కేటాయించడంతో అసమ్మతి మొదలైంది.
పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే పల్లా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ మున్సిపల్ పాలక మండలిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పంతం పట్టి నెగ్గించుకున్నారు. తన పార్టీకి చెందిన అసమ్మతి రాగం ఎత్తుకున్న నలుగురు కౌన్సిలర్లలో ఇద్దరిని అవిశ్వాస తీర్మానం మీటింగ్కు హాజరుకాకుండా ఆపివేసి తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పీల్చుకున్నట్లయింది.
నాడు ఎగేసి.. నేడు గైర్హాజరు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అవిశ్వాసానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు తెరలేపారు. బీఆర్ఎస్కు చెందిన మూడో వార్డు మెంబర్ మంగోలు చంటి, 12వ వార్డు కౌన్సిలర్ సతీశ్ గౌడ్ అవిశ్వాస తీర్మానం పెడదామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పురమాయించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన ఆ ఇద్దరే మీటింగ్కు గైర్హాజర్ అయ్యారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు వారి తీరును నిరసించారు. ఈ నేపథ్యంలో వారికి ముడుపులు అందడం వల్లనే అవిశ్వాస మీటింగ్కు రాలేదని ఆరోపించి మున్సిపల్ ముందు నిరసన వ్యక్తం చేశారు.