హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో తాగునీటి సమస్య లేదని, డిమాండ్కు అనుగుణంగా సరఫరా జరుగుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం సిటీలో ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మంత్రి వాటర్ సమస్యపై స్పందించారు. సిటీలోనే కాదు.. ఔటర్ పరిధిలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడినా 155313 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చని సూచించారు.
వెంటనే వాటర్బోర్డు అధికారులు స్పందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సిటీలో గత నీటి అవసరాలకుగాను 2300 ఎంఎల్డీ సరఫరా చేయగా.. ప్రస్తుతం 24,602 ఎంఎల్డీల నీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రేటర్ సిటీతో 700 ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నామని, త్వరలో మరో 100 ట్యాంకర్లను పెంచనున్నామని చెప్పారు. నాగార్జున సాగర్,ఎల్లంపల్లి, హయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్ లో సరిపడా నీటి నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి పొన్నం ఆరోపించారు.