ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయంతో సిరీస్కు దూరం కానుండటంతో అతడి స్థానంలో ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వుడ్ ఓపెనర్లయిన మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ లాంటి బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్ వైపు కోచ్ రవిశాస్త్రి చూస్తున్నారు. ఇందులో భాగంగా గిల్కు రీప్లేస్మెంట్ కోసం వారిద్దరినీ ఇంగ్లండ్కు రప్పించేందుకు రవిశాస్త్రి యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ కీపర్ సబా కరీం స్పందించారు. పృథ్వీ షా, పడిక్కల్ను తీసుకోవాలనుకంటే జట్టులో ముందే ఎందుకు చేర్చలేదని సబా ప్రశ్నించాడు.
‘జట్టులో కొత్త ఆటగాళ్లను చేరిస్తే ఇప్పటికే టీమ్లో ఉన్న ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? ఇది వారిని మానసికంగా దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితులు సృష్టించొద్దు. సెలెక్టర్లపై కాస్త నమ్మకం ఉంచాలి. వారు ఓ జట్టును ఎంపిక చేసి పంపారు. అయినా ఇలాంటి డిమాండ్ టీమ్ మేనెజ్మెంట్ నుంచి వచ్చి ఉంటుందని నేను అనకోను. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం ఇది సముచితం కాదు. రీప్లేస్మెంట్ కావాలనుకుంటే సెలెక్టర్లతో చర్చలు జరపాలి. ముఖ్యంగా చైర్పర్సన్తో మాట్లాడాలి. అదే టైమ్లో ఏ ప్లేయర్ను పంపాలనే దాన్ని సెలెక్షన్ కమిటీనే నిర్ణయించాలి. అయినా ఒక ప్లేయర్ను రప్పించినా అతడు ఆడటం కష్టమే. క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆడటం కుదరకపోవచ్చు’ అని సబా కరీం పేర్కొన్నాడు.