- నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి
- లాక్డౌన్ లో నాన్ ఎసన్షియల్ గూడ్స్ అమ్మకానికి నో
- ఈ కామర్స్ రూల్స్లో మళ్లీ మార్పులు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు తప్ప ఇతర వస్తువులను ఈకామర్స్ కంపెనీలు అమ్మడానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నుంచి హాట్స్పాట్లు కానీ ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలు, సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఓ లిస్ట్ను శనివారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం ప్రకటించిన గైడ్ లైన్స్లో కూడా ఈ కామర్స్ కంపెనీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, స్నాప్డీల్.. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్లు, ల్యాప్టాప్స్, క్లాత్స్, స్కూల్ పిల్లలకు స్టేషనరీ ఐటమ్స్ మొదలైనవి అమ్మవచ్చు. తమ డెలివరీ వాహనాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా, చిన్న వ్యాపారులను దెబ్బ తీసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విమర్శల నేపథ్యంలో ఆదివారం తాజా గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ ఈ కామర్స్ కంపెనీలు లాక్డౌన్ టైమ్లో నిత్యావసర వస్తువులు తప్ప.. మిగతా వస్తువులు అమ్మడానికి లేదని ప్రకటించింది. మే 3 వరకూ ఈ గైడ్లైన్స్ వర్తిస్తాయని, అందరూ తప్పకుండా వీటిని పాటించాలని స్పష్టం చేసింది.