
ఆసిఫాబాద్, వెలుగు: ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ విడుదల చేసిన కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు విషయంలో అపోహలు నమ్మొద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సూచించారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుపై ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో బుధవారం ఆయన ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటును కొందరు టైగర్ జోన్ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు. 2014 నుంచే ఆసిఫాబాద్ జిల్లా టైగర్ కారిడార్ గా ఉందని గుర్తుచేశారు.
ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది కేవలం కన్జర్వేషన్ రిజర్వ్ మాత్రమేనని స్పష్టం చేశారు. జిల్లాలోని గిన్నెదరీ, జోడేఘాట్ అడవులు ముందునుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉన్నాయన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆంక్షలు ఉండవని వెల్లడించారు. ఇప్పుడున్న రూల్స్మాత్రమే ఉంటాయన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్ ద్వారా ఎన్నో లాభాలున్నాయని పేర్కొన్నారు.